ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఇందిరాగాంధీ
కాంగ్రెస్ పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది…బిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని గుంజుకుంటున్నది
బిజెపి, బిఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటై కాంగ్రెస్పై కుట్ర
ఎన్నికలు వొచ్చినప్పుడల్లా మతచిచ్చు రేపి లబ్ది పొందే యత్నం
ఆసిఫాబాద్ విజయ భేరి సభలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
ఆసిఫాబాద్/రెబ్బెన, ప్రజాతంత్ర, నవంబర్ 19 : ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సూచించారు. ఆదివారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ పక్కన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విజయభేరీ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…దేశం కోసం ఇందిరా గాంధీ ప్రాణ త్యాగం చేసి 40 సంవత్సరాలు గడిచిన దేశ ప్రజల హృదయలలో చిరస్థాయిగా ఉందని అన్నారు. జల్-జంగిల్-జమీన్ నినాదంతో ఏడు లక్లల ఎకరాల బీడు భూములకు పట్టాలు కాంగ్రెస ప్రభుత్వం ఇచ్చిందని, ఆదివాసీలు అభివృద్ధికి ఐటీడీఏ స్థాపించి గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తుచేసింది. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వలు ప్రజల సొమ్ముని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆదివాసుల సంక్షేమం కొరకు ఐటిడిఏ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ దేనిని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చామని ప్రస్తుత పాలకులు పేదల నుంచి ఉన్న స్థలాలు గుంజుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయని ప్రజల కోరిక మేరకు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆశయాలు నెరవేరే లేదని పేర్కొన్నారు.
బిజెపి, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ పార్టీకు నష్టం జరిగే విధంగా ఎన్నికల్లో కుట్రలు పన్నుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. నరేంద్ర మోదీ తన తెలంగాణ పర్యటనలో కాళేశ్వరం కుంభకోణంపై, బీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పైసా ప్రజలదేనని, ప్రజా ధనాన్ని బిజెపి, బీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికలు వొస్తే మూడు పార్టీలు ఏకమై దేశంలో మత చిచ్చులు పెడుతూ ప్రజలకు మభ్యపెడుతూ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని ప్రియాంక ప్రశ్నించారు. మహిళలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షల్లో పేపర్ లీక్ కావడంతో అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నకార్థంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఈ సందర్భంగా ఆమె ప్రజలకు వివరించారు..ఈ నెల 30 తేదీన చేతి గుర్తుకు వోటు వేసి కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ అభ్యర్థి అజ్మీర శ్యాం నాయక్, సిర్పూర్ టి అభ్యర్థి రావి శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్, డిసిసి జిల్లా అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, కాంగ్రెస్ ఆసిఫాబాద్, సిర్పూర్ టి నియోజకవర్గ అభ్యర్థులు అజ్మీర శ్యాం నాయక్, రావి శ్రీనివాస్ , ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్, రాజుర ఎమ్మెల్యే సుభాష్ రావు ధుటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు రోహిత్ చౌదరి, నరేష్ జాదవ్, గణేష్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.