ముండ్రాయి వెలుగు గ్రామైక్య సంఘం జిల్లాకే గర్వ కారణం: మంత్రి హరీష్రావు
సిద్ధిపేట, మే 5 (ప్రజాతంత్ర బ్యూరో): మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనబరచిన సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని ముండ్రాయి వెలుగు గ్రామ సమాఖ్యకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ అవార్డు అందజేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అందించిన నగదు పారితోషికం రూ.2 లక్షల చెక్కుతో పాటు జ్ఞాపిక ప్రశంసాపత్రంతో జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి గోపాల్ రావు, ఏపిడి రవీందర్, డిపిఎం విద్యాసాగర్, ముండ్రాయి వెలుగు గ్రామైక్య సంఘ కార్యదర్శి కనకవ్వ, వివోఏ వేంకటేశం తదితరులు బుధవారం సాయంత్రం సిద్ధిపేటలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావును కలెక్టరేట్లో కలిశారు. ముండ్రాయి వెలుగు గ్రామైక్య సంఘ కార్యదర్శి కనకవ్వను మంత్రి హరీష్రావు శాలువాతో సత్కరించారు. అద్భుత పనితీరుతో గ్రామ సమాఖ్య కేటగిరీలో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయి వెలుగు గ్రామైక్య సంఘం జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం జిల్లా కే గర్వ కారణం అన్నారు. జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక కావడం మహిళల ఐక్యతకు గొప్ప నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా వెలుగు గ్రామైక్య సంఘం సభ్యులను, గ్రామ ప్రజలను ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరినీ మంత్రి హరీష్రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, సుడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆక్సిజన్ నిల్వలపై మానిటరింగ్ పెంచాలి: అధికారులను ఆదేశించిన మంత్రి హరీష్రావు
జిల్లాలో ఆక్సిజన్ నిల్వలపై మానిటరింగ్ పెంచాలని … ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్సిజన్ కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల నీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. జిల్లాలోనీ కోవిడ్ బాధితులకు అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని మంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అదేశించారు. బుధవారం సిద్దిపేట నుండి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా వైద్య అధికారులు, జిల్లా అధికారులతో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వెంటిలేషన్ ఆధారిత చికిత్స పొందుతున్న బాధితులకు నిరంతర ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ నిల్వలు పెంచడం, పడకల సంఖ్య పెంచడం తదితర అంశాలపై మంత్రి తన్నీరు హరీష్ రావు సమావేశం నిర్వహించారు. కోవిడ్ బాధితులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని నిల్వల పై ప్రత్యేక దృష్టి సారించాలని హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్క పేషంట్ ఇబ్బంది పడకూడదన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలతో పాటు సిద్దిపేట సురక్ష ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు, డిమాండ్, సరఫరాపై అధికారులు నిత్యం మానిటరింగ్ చేయాలన్నారు. అందుబాటులో ఉన్న ఆక్సిజన్ నిల్వలను అనవసర ఖర్చు లేకుండా… ఉన్నదాన్ని హేతుబద్ధంగా గరిష్ఠ స్థాయిలో కోవిడ్ బాధితులకు ఉపయోగించుకోనేలా ప్రతి రోజూ సమీక్ష నిర్వహించాలని సూచించారు.హొడిమాండ్ అత్యధికంగా ఉన్న క్లిష్ట సమయంలో నూ జిల్లాలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్, వైద్యాధికారులు కాశీనాథ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.