- ట్రాన్స్కో, జెన్కో సిఎండిగా ముర్తుజా రిజ్వి
- హెచ్ఎండిఎ జెసిగా ఆమ్రపాలీ
- వైద్యారోగ్యశాఖ కార్యదర్శిగా శైలజా రామయ్యర్
- డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కారు.. ఇప్పటివరకు ఉన్న అధికారులకు స్థాన చలనం కల్పిస్తుంది. ఈ క్రమంలోనే.. ఇన్ని రోజులు సరైన గుర్తింపు లభించని అధికారులకు కీలక బాధ్యతలు అప్పజెప్తుంది. ఇప్పటికే.. రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్లకు స్థాన చలనం కల్పించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు పలువురు ఐఎఎస్లను బదిలీ చేస్తూ రేవంత్ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన విద్యుత్ శాఖలోనూ కీలక మార్పులు చేసింది. ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా ఉన్న ప్రభాకర్ రావు రాజీనామా చేయటంతో.. ఆ స్థానంలో సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని నిమామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. కేంద్రం సర్వీసుల నుంచి తిరిగి తెలంగాణకు వొచ్చిన ఆమ్రాపాలి కాటాకు రేవంత్ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా బాధ్యతలు ఇస్తూ, మూసీ అభివృద్ధి సంస్థ ఇంచార్జి ఎండీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఐటి మంత్రి శ్రీధర్ బాబు సతీమణి శైలజా రామయ్యర్ను నియమించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్గా బీ గోపి నియామకం అయ్యారు. ఇంధన శాఖ కార్యదర్శిగా రిజ్వి, ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా రిజ్వికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్రాన్స్కో సంయుక్త ఎండీగా సందీప్ కుమార్ రaా, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్, దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ అలీ, ఉత్తర డిస్కం సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.