•అధికారులు చర్యలెందుకు తీసుకోరు
•మేడ్చల్కు ఐటి కంపెనీల హామీని తుంగలో తొక్కారు
•అటకెక్కిన డంపింగ్ యార్డ్ సమస్య
•కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరుగ్యారంటీలతో పేదలను ఆదుకుంటాం
•జవహర్ నగర్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆరెస్ మేడ్చల్కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎందుకు ఇవ్వలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం మేడ్చల్లో కాంగ్రెస్ విజయ భేరి సభలో మాట్లాడుతూ…పేదోళ్ల బిడ్డలు చదువుకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని, అందుకే డిగ్రీ కాలేజీ ఇవ్వలేదని మండిపడ్డారు. మంత్రిగా ఉన్నా మాల్లారెడ్డితో నియోజకవర్గానికి ఎటువంటి ప్రయోజనం కలుగలేదన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప బీఆరెస్ చేసిందేం లేదని విమర్శించారు. హైదరాబాద్కు గోదావరి జలాలను తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ పరిస్థితి ఏంటని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆరెస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కేసీఆర్.. మళ్లీ మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలని వస్తుండు అన్నారు. ఈ ఎన్నికలు దేశ చరిత్రను మలుపు తిప్పివి అన్నారు. ఇవి దొరల తెలంగాణకు… ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు..దొరల తెలంగాణ కావాలో.. ప్రజా తెలంగాణ కావాలో తేల్చుకోండన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేడ్చల్ కు డిగ్రీ కాలేజీ, వందపడకల హాస్పిటల్ తెచ్చే బాధ్యత మాదన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.
మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని బొడుప్పల్ మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో 23 డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, ఒకటవ డివిజన్ కార్పోరేటర్ బింగి జంగయ్య యాదవ్,13 వ డివిజన్ కార్పోరేటర్ దానగళ్ల అనితా-యాదగిరి, 20 వ డివిజన్ కార్పోరేటర్ జడిగే మహేందర్ యాదవ్,24 వ డివిజన్ కార్పోరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ ఉన్నారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్లో చేరిన పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి రాఘవరావు, మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన పిఏసిఎస్ చైర్మన్ చల్లా లింగా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.