న్యూ దిల్లీ, జనవరి 31 : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెంట్రల్హాల్లో ప్రసంగించారు. రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు బహిష్కరించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంట్లో నిలదీయాలని, అందుకు కలిసివొచ్చే పార్టీలతో సమిష్టి వ్యూహాన్ని అనుసరించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలి అడుగుగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బిఆర్ఎస్ బహిష్కరించింది.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో సోమవారం జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు హాజరయ్యారు. తెలంగాణతో పాటు దిల్లీ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థతో ఇబ్బందులు ఉన్నాయని కేకే పేర్కొన్నారు. దీనితోపాటు దేశ సమాఖ్య వ్యవస్థపై పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై పార్లమెంట్లో చర్చ జరుగాలని డిమాండ్ చేశారు. మరోవైపు వివిధ అంవాలపై కేంద్రాన్ని నిలదీస్తామని పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు స్పష్టం చేశారు.