- కొత్త విద్యావిధానంతో ప్రతిభను ప్రదర్శించగలిగే స్వేచ్ఛ
- శాంతినికేతన్ స్నాతకోత్సవంలో మోడీ వర్చువల్ ప్రసంగం
విశ్వభారతి విశ్వవిద్యాలయంలో విద్యా వ్యవస్థను గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ సమున్నత లక్ష్యంతో అభివృద్ధి చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లోబడి ఉండాలనే సంకెళ్ళ నుంచి భారతదేశ విద్యా వ్యవస్థకు విముక్తి కల్పించడం, ఆధునికీకరించడం లక్ష్యంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దారన్నారు. ఈ విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ సందర్భంగా శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) లక్ష్యం కూడా పాత సంకెళ్ల నుంచి భారత దేశ విద్యా వ్యవస్థకు విముక్తి కల్పించడమేనని మోదీ చెప్పారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించగలిగే స్వేచ్ఛను నూతన విద్యా విధానం ఇస్తుందని తెలిపారు. స్వయం సమృద్ధ భారత దేశం వైపు వేసిన గొప్ప ముందడుగు నూతన జాతీయ విద్యా విధానమని పేర్కొన్నారు. పరిశోధన, నవకల్పనలకు ఈ విధానం శక్తినిస్తుందన్నారు. 2021 కేంద్ర బడ్జెట్లో జాతీయ పరిశోధన ఫౌండేషన్ ద్వారా రూ.50 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.
పరిశోధన ఆధారిత అధ్యయనం కోసం రానున్న ఐదేళ్ళలో ఈ సొమ్మును ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. బాలికలు, మహిళలు సాధికారులు కాకపోతే మన దేశం స్వయం సమృద్ధి సాధించడం సాధ్యం కాదన్నారు. నూతన జాతీయ విద్యా విధానంలో జెండర్ ఇంక్లూజన్ నిధిని ఏర్పాటు చేశామని, దీనిని బాలికలను సాధికారులను చేయడానికి వినియోగిస్తామని చెప్పారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ప్రేరణాత్మకంగా, సంతోషంగా ఉందన్నారు.
నేరుగా ఆ కార్యక్రమంలో పాల్గొనుంటే బాగుండేదని, కానీ కోవిడ్ వల్ల అక్కడికి రాలేకపోయినట్లు ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, హింసను వ్యాప్తి చేస్తున్నవారిలో అత్యధికంగా ఉన్నత చదువులు చదువుకున్నవారు, నైపుణ్యం కలిగి ఉన్నవారే ఉన్నారన్నారు. మరోవైపు హాస్పిటళ్లు, ల్యాబ్ల్లో ఉన్న అనేక మంది మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు తమ ప్రాణాలను రిస్క్లోకి నెట్టేస్తున్నారన్నారు. ఇది ఐడియాలజీకి సంబంధించిన అంశం కాదు అని, ఇది మైండ్సెట్కు సంబంధించిన అంశమని ప్రధాని తెలిపారు.
మీరు ఏది చేసినా.. అది మి మైండ్సెట్ పాజిటివ్గా ఉందా లేక నెగటివ్గా ఉందా అన్న అంశంపై ఆధారపడుతుందన్నారు. అయితే ప్రతి ఒక్కరికీ ఆ రెండు అంశాలు ఎదురవుతుంటాయని, కానీ సమస్యలు సృష్టించాలా లేక పరిష్కరించాలా అన్న అంశాన్ని ఎన్నుకునేది మన చేతుల్లో ఉంటుందని ప్రధాని తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం.. ఆత్మనిర్బర్ భారత్కు కీలకమైన అడుగు అన్నారు. ఆ విద్యావిధానం ద్వారా పరిశోధన, ఆవిష్కరణలు పెరుగుతాయని అన్నారు. కొత్త విద్యావిధానంతో మన దేశం విశ్వగురువుగా మారుతుందని బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ తెలిపారు. విద్యా సంస్కరణల్లో ఈ స్కీమ్ గేమ్చేంజర్గా పనిచేస్తుందని ఆయన అన్నారు.