- కొత్తగా 42982 మందికి పాజిటివ్..533 మంది మృతి
- అమెరికాలో మళ్లీ కోరలు చాస్తున్న కొరోనా..ఒక్కరోజే లక్షన్నర కేసులు నమోదు
భారతదేశంలో కొరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దేశంలో రోజూవారీగా నమోదవుతున్న కొరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మంగళవారం కంటే బుధవారం పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 42982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 31812114 కొరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 411076 యాక్టివ్ కేసులు ఉండగా.. 30974748 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే నిన్న 533 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 426290కి చేరింది. అటు బుధవారం 41726 మంది కొరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది.
ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.29 శాతంగా ఉండగా.. రికవరీ రేట్ 97.37 శాతంగా ఉంది. మరోవైపు నిన్న ఒక్క రోజులో 3755115 మందికి టీకా వేయగా.. ఇప్పటిదాకా 489342295 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు 51.01 కోట్ల టీకా డోసులను రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో ఇప్పటిదాకా పంపిణీ అయిన వృథా అయిన టీకాల మొత్తం 486015232గా ఉందని వెల్లడించింది. కేరళలో కొరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. అక్కడ ప్రతి రోజు 20వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం 22414 మందికి కొరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మహారాష్ట్రలో 6126 మంది కొరోనా బారినపడ్డారు. బుధవారం దేశవ్యాప్తంగా 1664030 మందికి కొరోనా పరీక్షలు చేయగా 3755115 డోసుల టీకా వేశారు. మన దేశంలో ఇప్పటి వరకు 489342295 డోసుల టీకాలు వేశారు.
అమెరికాలో మళ్లీ కోరలు చాస్తున్న కొరోనా..ఒక్కరోజే లక్షన్నర కేసులు నమోదు
అమెరికాలో కొరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయి. ఫ్లోరిడాతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో వైరస్ విజృంభిస్తుంది. పద్దెనిమిదేండ్లు నిండిన వాళ్లలో 70% మంది టీకాలు వేయించుకున్నా మూడు నాలుగు రోజులుగా రోజూ 70 వేల నుంచి లక్ష దాకా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా మంగళవారం నాటికి కేసుల సంఖ్య లక్షన్నరకు చేరింది. 24 గంటల్లో అమెరికా వ్యాప్తంగా 1,49,788 మందికి కొరోనా సోకింది. వైరస్తో 516 మంది చనిపోయారు. మొత్తం కొరోనా కేసుల సంఖ్య 3.53 కోట్లకు, మొత్తం మృతుల సంఖ్య 6.14 లక్షలకు చేరుకుంది. మరోవైపు, ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో మంగళవారం ఒక్కరోజే 11,515 మంది కొరోనా పేషెంట్లు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. గతంలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నపుడు ఈ స్థాయిలో పేషెంట్లు అడ్మిట్ అయ్యేవారని అధికారులు చెప్పారు. కేసులు తగ్గడంతో గతంలో సడలించిన ఆంక్షలను తిరిగి అమలుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. టీకా అందుబాటులోకి రావడంతో పాటు వైరస్ బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కొరోనాపై విజయం సాధించామని జులై 4 న ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రకటించారు. అయితే, పరిస్థితి మళ్లీ అదుపుతప్పుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కొరోనా కేసుల్లో అత్యధిక కేసులు ఒక్క అమెరికా నుండే వొస్తున్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో అగ్రరాజ్యం వణికిపోతుంది.