- 25 వరకు నిధుల పంపిణీ పూర్తి
- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
వానాకాలం రైతు బంధు సాయం కింద రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రూ. 1,69.42 కోట్లు జమయినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం రెండవ రోజు 15.07 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 1152.46 కోట్లు జమయినట్లు వివరాలు వెల్లడించారు. గురువారం మూడవ రోజు 10.40 లక్షల మంది ఖాతాల్లోకి రూ.1,272.85 కోట్లు జమ కానున్నట్లు ఆయన పత్రికా ప్రకటనలో వెల్లడించారు. మూడు రోజులలో 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2942.27 కోట్లు జమ కానున్నట్లు తెలిపారు.
మూడో రోజు నల్లగొండకు అత్యధికంగా 79,727 మంది రైతులకు రూ.98.29 కోట్లు, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 3701 మంది రైతులకు రూ.4.45 కోట్లు జమకానున్నట్లు తెలిపారు. ఈ నెల 25 వరకు రైతులకు రైతుబంధు నిధుల పంపిణీని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. పత్తి, కంది అధికంగా సాగు చేయడంతో పాటు రైతులు పప్పు దినుసులు, నూనెగింజల పంటల సాగును పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతాంగం దృష్టి సారించాలని అన్నారు.