భారతీయ కిసాన్ సంఘం ఆగ్రహం
వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు కీలక బిల్లులకు లోక్సభ ఆమోదం తెలుపడంతో.. దేశ వ్యాప్తంగా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘం(బీకేఎస్) ఈ బిల్లులపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. కార్పొరేట్లకు పట్టం కట్టి.. రైతులకు అన్యాయం చేస్తున్నారని బీకేఎస్ జనరల్ సెక్రటరీ బద్రి నారాయణ్ చౌదరి మండిపడ్డారు. వ్యవసాయ మార్కెట్ల సంస్కరణ, పంటల ఒప్పంద నిబంధనల బిల్లు, నిత్యావసర సరుకుల (సవరణ) -2020 బిల్లులు ఆమోదం పొందడంతో రైతులకు క్లిష్టతరమైన పరిస్థితులు ఎదురవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాము రైతుల పక్షాన కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. కనీస మద్దతు ధరను కూడా రైతులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. రైతుల బాధలు కేంద్రానికి పట్టకపోవడం చాలా దురదృష్టకరమని చౌదరి పేర్కొన్నారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి ఇప్పటికే 50 వేల మంది రైతులు లేఖలు రాశారని గుర్తు చేశారు. అగ్రి బిల్లులను బీకేఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చౌదరి స్పష్టం చేశారు.