రఘునందన్ రావుకు వోటు అడిగే హక్కు లేదు
కొత్త ప్రభాకర్ రెడ్డి ..పాతచింతకాయ పచ్చడే
దుబ్బాక సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 23 : అక్రమంగా లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న, 10 వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దోచుకున్న డబ్బులు, కక్కిస్తామని, అక్రమించుకున్న భూములను గుంజుకుంటామన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా జరిగిన విజయభేరి జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ…మాట నిలబెట్టుకోని రఘునందన్ రావుకు మళ్లీ వోటు అడిగే హక్కు లేదని వ్యాఖ్యానించారు. పదేళ్లుగా ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఈ ప్రాంతానికి చేసిందేం లేదన్నారు. దుబ్బాకకు నిధులు రాకుండా సిద్దిపేటకు తరలించుకుపోవడం మామా, అల్లుళ్లకు అలవాటైందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కేంద్రం నిధులు తెచ్చి రఘునందన్ రావు దుబ్బాకను అభివృద్ధి చేస్తానన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని రఘునందన్కు మళ్లీ వోటు అడిగే హక్కు లేదని మండిపడ్డారు. ఈ ప్రాంతానికి 10 వేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే ఆయనకు ఆ హక్కు ఉండేదన్నారు. పార్టీ రాజకీయ కుమ్ములాటల్లో బిజీగా ఉండు తప్ప…ఈ ప్రాంత అభివృద్ధి కోసం రఘునందన్ రావు చేసిందేం లేదని విమర్శించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్త ఉంది తప్ప..ఆయన పాతచింతకాయ పచ్చడే అని ఎద్దేవా చేశారు. దొర గడీలో కాపలా ఉండే ప్రభాకర్..ఎందుకు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయలేదు? ఎందుకు దుబ్బాకకు నిధులు తెప్పించలేదు? ఎందుకు ఈ దుబ్బాకకు పీజీ కాలేజీ తీసుకురాలేదు? అని ప్రశ్నించారు.
కేసీఆర్ గడిలో పెద్ద జీతగాడిలా..బంట్రోతులా పనిచేశాడు తప్ప..దుబ్బాక ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం బంగారుమయంగా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారన్నారు. కేసీఆర్ బక్కోడు కాదు.. బకాసురుడు..ఫామ్ హౌస్లో పడుకునే కుంభకర్ణుడు. కేసీఆర్కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టించడం ఖాయం.. దోచుకుంది కక్కించడం ఖాయమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రఘునందన్ను, కొత్త ప్రభాకర్ రెడ్డిని చూశారు..ఇక వాళ్లను చూడాల్సిందేం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నీతికి, నిజాయితీకి మారుపేరు చెరుకు ముత్యంరెడ్డి. ఈ ప్రాంతానికి ఇవ్వాల్సిన నిధులను కేసీఆర్ సిద్దిపేటకు తరలించకుండా చెరుకు ముత్యం రెడ్డి కొట్లాడిండు. అలాంటి ముంత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించండని రేవంత్ రెడ్డి కోరారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.