బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు..ఎందుకు వోటేయాలి
- లక్షా 32 వేల ఉద్యోగాలిచ్చాం..ఎక్కడైనా చర్చకు రెడీ
- వాణీదేవీ అర్హతలు దృష్టిలో పెట్టుకొని వోటేయండి
- జీహెచ్ఎంసీ పరిధి పార్టీ ముఖ్యనేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం ఆరేళ్లలో లక్షా 32వేల 799 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఎవరికైనా అనుమానం వుంటే తాను చర్చకు సిద్దమన్నారు. ప్రధాని మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.టీఎస్ ఐపాస్ ద్వారా 14 వేల పైన కంపెనీలు స్థాపించామని.. ఇందులో 14 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్లో సమావేశమైన కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు.
ఉమ్మడి ఆంధప్రదేశ్లో పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 24 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. భర్తీ విషయంలో తాను చెప్పింది సరైంది కాదని ఎవరైనా భావిస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ చెప్పారు. తెరాస ప్రభుత్వం ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లో నేరుగా, క్రమబద్ధీకరించినవి కలిపి మొత్తంగా 1,32,799 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన తెలిపారు. వాటిలో 36వేలకు పైగా ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టినట్లు చెప్పారు. మరో నాలుగు వేల ఉద్యోగాల భర్తీ బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించినప్పటికీ కోర్టు వివాదాల కారణంగా అవి వాయిదా పడినట్లు కేటీఆర్ వివరించారు. ఉమ్మడి ఆంధప్రదేశ్లో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టింది ఒక్క తెరాస ప్రభుత్వమేనన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి ఉన్న అర్హతలు ఇతర పార్టీల అభ్యర్థులకు లేవని.. ఆమె విజయానికి కృషి చేయాలని నేతలకు కేటీఆర్ సూచించారు. విభజన హామీలు నెరవేర్చని భాజపాకు మనం వోటు వేయాలా?లేదా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని కేటీఆర్ అన్నారు.
జీడీపీ పెంచుతామని చెప్పిన కేంద్రం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతుందని చురకలు అంటించారు. ఇవాళ పెద్దఎత్తున తెరాసపై దుష్ప్రచారం చేస్తున్న భాజపా నేతలు,, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ఒక్కపైసా తీసుకొచ్చారా? న్యాయవాదులు, పట్టభద్రులకు ఏమైనా చేశారా? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిన ప్రధాని మోదీ ఏడేళ్లుగా ఎన్ని సృష్టించగలిగారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. మతాల పేరుతో రాజకీయం చేయకుండా జనహితం కోసం చేయాలని హితవు పలికారు. ఏడేళ్ల పాలనలో తెలంగాణ ప్రగతికి ఏమీ చేయని భాజపాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఐటీఐఆర్ను భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేసిందని.. అలాంటి పార్టీకి యువత ఎందుకు వోటేయాలని కేటీఆర్ ప్రశ్నించారు.
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్ రావుపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన.. ఏ ప్రభుత్వాలు చేయనన్ని ఉద్యోగ నియామకాలు చేశామని అన్నారు. చిరుద్యోగుల శ్రమదోపిడి తగ్గించామన్నారు. ఏ ప్రభుత్వం ఇవ్వని ఫిట్మెంట్ను టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిందన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి రూ. 100కోట్లు ఇచ్చామని, బీజేపీకి ఎందుకు వోటేయాలో ఒక్క కారణం చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందన్నారు. కేంద్రం నుంచి రామచందర్ రావు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. అన్యాయంగా మాట్లాడొద్దని రామచందర్ రావుకు హితవు పలికారు. మతం పేరిట రాజకీయం కాదని, జన హితం ముఖ్యమన్నారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో వోటు అడిగే నైతిక హక్కు లేదని, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచారన్నారు. బరిలో నిలిచి తేల్చుకునేందుకు పీవీ వాణి ముందుకు వచ్చారన్నారు.