హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్గా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారని, ఇది సీఎం కేసిఆర్ పట్టుదలకు నిదర్శనం..రాష్ట్ర చరిత్రలో సుదినమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని ఆయన మార్గ నిర్దేశంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించామని తెలుపుతూ..గత సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించి తెలంగాణ కొత్త రికార్డు సృష్టించిందని, ఈ సంవత్సరం మన రికార్డును మనమే అధిగమించామన్నారు.
ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వొచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతం కావడడం కూడా గొప్ప రికార్డని, దేశంలోని మిగితా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 57 శాతం సీట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. ఒకప్పుడు బెంగాల్ ఆలోచిస్తుంది..దేశం అచరిస్తుందనే నానుడి ఉండేదని, దాన్ని తిరగరాసిన ఘనత సీఎం కేసిఆర్ దన్నారు.
ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే.. దేశం మొత్తం అదే దారిలో నడుస్తున్నదన్నారు. ఇప్పుడు తెలంగాణ అచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందన్నంత గొప్పగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారాన్నరు. ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు..సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దని అన్నారు. ఈ సందర్భంగా అడ్మిషన్లు పొందిన వైద్య విద్యార్థులకు మంత్రి హరీష్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంత గొప్ప పవిత్ర యజ్ఞంలో తనకు భాగస్వామ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు హృదయ పూర్వక ధన్యవాదాలు..నమస్కారం తెలిపారు.