- తెలంగాణ వ్యాప్తంగా కొరోనా వ్యాక్సిన్ ప్రారంభం
- గాంధీలో ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ ప్రారంభమైంది. గాంధీ హాస్పిటల్ లో సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మ కొరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులోకి ఎక్కింది. టీకా ఇచ్చిన అనంతరం ఆమెతో మంత్రి ఈటల రాజేందర్ సంభాషించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెను అబ్జర్వేషన్ గదికి తరలించారు శనివారం ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాద్లోని నిమ్స్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, గాంధీ హాస్పిటల్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, తిలక్నగర్లోని యూపీహెచ్సీలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు టీకాల పక్రియను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. ఒక్కో కేంద్రంలో 30 మందికి మించకుండా టీకాను వేయించారు. తొలిరోజు మొత్తం 4,170 మందికి టీకా వేయనున్నారు. టీకా వేసినట్లు గుర్తింపుగా లబ్దిదారుడి ఎడమచేతి బొటనవేలికి సిరా చుక్కను గుర్తుగా వేస్తున్నారు. శనివారం మొత్తం పారిశుద్ధ్య కార్మికులకే టీకా ఇస్తున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ లో మొత్తం 50 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసి ప్రారంభించారు.. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కొరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ఈ కేంద్రంలో 30 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ వ్యాక్సిన్ తీసుకోనున్నారు. వ్యాక్సిన్ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు.