ఇన్నాళ్లూ విమర్శలు చేస్తూ కాలయాపన చేశారు
ముందే మేల్కోని వుంటే పంటలు కాపాడుకునే వారు
నల్లగొండలో కెసిఆర్ పర్యటనల తరువాత ప్రజల్లో పునరాలోచన
రేవంత్కు నల్లగొండ, ఖమ్మం నేతలతోనే ముప్పు
పార్లమెంటరీ స్థాయి సమీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
నల్లగొండ,ప్రజాతంత్ర,ఏప్రిల్1: కాళేశ్వరంపై అవాకు లు చవాకులు పేలిన వారే.. కెసిఆర్ రైతల బాట పట్టడంతో నీళ్లు విడుదల చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విమర్శించిన కాళేశ్వరమే నీళ్లు అందిస్తున్నదని అర్థం అయ్యిందన్నారు. ఈ పని ముందే చేసివుంటే రైతుల పంటలు కాపాడుకునే వారిమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఏక్నాథ్ షిండేలు ఉన్నారని.. నీ పక్కనే ఉన్న ఖమ్మం, నల్లగొండ బాంబులతోనే నీకు ప్రమాదం పొంచి ఉందని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీతో రేవంత్కు ఎలాంటి ఇబ్బంది లేదని, ఈ ఐదేండ్లు ఆయనే పాలించి, హాలు అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన నల్లగొండ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చి వంద రోజులు గడుస్తున్నప్పటికీ రుణమాఫీ చేయలేదు. రైతుబంధు ఇవ్వలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం పై గ్రామాల్లో రైతులు కుతకుత ఉడుకుతున్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టండి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటడు. చెప్పుతో కొట్టమన్న ఆయన అహ్రంకారానికి వోటు అనే ఆయుధంతో వేటు వేయండి. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. అహంకారంగా మాట్లాడే ఈ జిల్లా నాయకులకు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
రూ. 2 లక్షల రుణమాఫీ కావాలంటే, రూ. 15 వేల రైతుబంధు ఇవ్వాలంటే, వరి ధాన్యానికి బోనస్ రూ. 500 ఇవ్వాలంటే బీఆర్ఎస్కు వోటేయాలి. కాంగ్రెస్కు వోటేస్తే.. తాము ఏవీ అమలు చేయకున్నా.. మళ్లీ మాకే వోటేశారని తప్పించుకు తిరుగుతారు. సీఎం రేవంత్ జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా అంటుండు. తనకు తెలిసి జేబు దొంగలు తిరుగుతారు ముఖ్యమంత్రులు తిరుగరని కేటీఆర్ తెలిపారు. పేగులు కట్ చేసి మెడలో వేసుకుంటా అంటుండు. అది ముఖ్యమంత్రి చేసే పనా.. అది బోటి కొట్టేడు చేసే పని. సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉన్నాయకున్నా.. ఇక్కడ ఖాలీ బిందెలు ఉన్నాయి. అయినా లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు.. అని కేటీఆర్ ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లి నితిన్ గడ్కరీ వద్ద నేనొస్తా నేనొస్తా అని అంటున్నారట. రుణమాఫీ చేయ్. 18 ఏండ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 2500 ఇస్తానని చెప్పావు. రైతుబంధు రూ. 15 వేలు ఇస్తా అన్నావు.. దాని కోసం రైతలు ఎదురు చూస్తున్నారు. ఆటో డ్రైవర్లు రోడ్ల ద పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 10 వేలు ఇచ్చి ఆదుకోవాలి. దమ్ముంటే ఈ పనులు చేసి చూపించు అని కేటీఆర్ సవాల్ చేశారు. పొంకనాల పోతిరెడ్డి మాటలు విని ప్రజలు మోసపోయారు. నిజం నిలకడ దనే తెలుస్తుంది. ఇదే తెలంగాణ ప్రజలు ప్రేమతో, దయతో పదేండ్లు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగాన్ని తలపించింది. ఇక బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే.. బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ దాకా మాట్లాడారు. ఇవాళ రాహుల్ మాట్లాడుతూ.. మోదీ దొంగ అంటడు.
రేవంత రెడ్డేమో మోదీ మా పెద్దన్న అని అంటుండు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటుంటే.. అదానీ మా ఫ్రెండ్ అని రేవంత్ అంటుండు. లిక్కర్ స్కాం లేదు.. కేజీవ్రాల్ను అరెస్టు చేయడం అన్యాయం అని రాహుల్ అంటుండు. లిక్కర్ స్కాం నిజమే. కవిత అరెస్టు కరెక్ట్ అని రేవంత్ అంటుండు. గుజరాత్ ఓ ఫేక్ మోడల్ అని రాహుల్ అంటడు.. తెలంగాణను గుజరాత్ మోడల్లా చేస్తా అని రేవంత్ అంటున్నాడు. రేవంత్ రాహుల్ కోసమా, మోదీ కోసమా పని చేసేది. ఒక్క వోటు కాంగ్రెస్కు వేసినా అది బీజేపీకి పోతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇదే రేవంత్.. షెల్టర్, భవిష్యత్, కేసుల నుంచి బయటపడటం కోసం బీజేపీలో చేరుతారు. ఈ మాట పదిసార్లు అన్నాను. కానీ ఈ విషయంలో మాత్రం రేవంత్ స్పందించడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ నిన్నటి పర్యటన వీడియోలు చూస్తే నల్గొండ జిల్లాలో ఎలా ఓడిపోయామో తెలియడం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేళ్ల నిజం ముందు వంద రోజుల అబద్దాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మోసపోయినోళ్లు బీఆర్ఎస్ వోటేయాలని.. రుణమాఫీ వొచ్చినోళ్లు కాంగ్రెస్కు వోటేయాలన్నారు.
కరెంటు, నీళ్లు ఇవ్వక పోయినా, పంటలు ఎండినా కాంగ్రెస్కే వోటు వేస్తే ఐదేళ్లు తప్పించుకుంటారన్నారు. తప్పు ప్రజలది కాదు. కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి మనం తీసుకెళ్లలేకపోయాం. అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ తెలిపారు. తుంగతుర్తి, సూర్యాపేటలో కేసీఆర్ పర్యటన సందర్భంగా జనంలో ఆ ఎమోషన్ చూస్తుంటే.. అసలు నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందనేది అర్థం కాలేదు. ఓటమి గల కారణాలపై ఈ వంద పది రోజుల్లో వేల మందితో కూర్చొని మాట్లాడుకున్నాం. ఏం జరిగిందని విశ్లేషించుకున్నాం. నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ సభలకు హాజరైనప్పుడు.. ఆ జనాన్ని చూసి బీఆర్ఎస్ గెలుస్తుందని నమ్మాం. ర్యాలీలు, సభలకు వచ్చిన జనాలను, వారి ఉత్తేజాన్ని చూసిన తర్వాత నల్లగొండలో 12 లో 8 సీట్లు గెలుస్తామన్న విశ్వసాంతో ఉన్నాం. కానీ ఫలితాలు దానికి భిన్నంగా వచ్చాయన్నారు.
మన మిత్రుడు భూక్యా జాన్సన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దాదాపు 45 నియోజకవర్గాల్లో ఓయూకు చెందిన 20 మంది విద్యార్థులతో సర్వే చేయించారు. ఆ సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వొచ్చాయని కేటీఆర్ తెలిపారు. మనం తప్పకుండా పార్టీ కుటుంబ సభ్యులుగా కేసీఆర్ బిడ్డలుగా ఆత్మ విమర్శ చేసుకోవాలి. మొన్న జరిగిన పొరపాట్లు పార్లమెంట్ ఎన్నికల్లో జరగకూడదు. పని చేసుకుంటూ వెళ్లిపోయాం.. కానీ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పాలనలో ఒక లక్షా 60 వేల 283 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఈ దేశంలో ఈ పదేండ్లలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే దేశంలోనే అత్యధికంగా ఉద్యోగాల భర్తీ చేసి కూడా వాళ్ల మనసు గెలుచుకోవడంలో విఫలమయ్యాం. కేసీఆర్ పాలనలో ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు నేనే ఇచ్చానని రేవంత్ రెడ్డి ఊదరగొడుతూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. పరీక్ష పెట్టలేదు. ఈ అబద్దాలను ప్రజలకు, యువతకు వివరించాలి. మనం ఉద్యోగాలిచ్చి కూడా చెప్పుకోలేకపోయాం. అయితే లంబాడీ తండాల్లోని కొంతమంది నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు రాలేదు చెప్పారు. పెన్షన్లకు ఆశపడి వోటు వేయకండి.. తమకు ఉద్యోగాలు వస్తే తామే అంతకు ఎక్కువ ఇస్తామని చెప్పి వృద్ధుల కాళ్లు మొక్కి నిరుద్యోగులు వోట్లు వేయించారు. మరి లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పడంలో విఫలమయ్యాం.
ఇక గృహలక్ష్మి అనే పథకం ఎన్నికలకు ఏడాది ముందే అమలు చేసి ఉంటే.. వోట్లు పడేవి అని విద్యార్థులు పేర్కొన్నట్లు సర్వేలో తేలినట్లు కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు 73 శాతం జీతం పెంచిన నాయకుడు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చాం. కానీ ఉద్యోగులకు దూరమయ్యాం. ఒకటో తేదీన జీతం రాలేదని చెప్పి వోట్లు వేయలేదు. కొరోనాతో పాటు ఇతర సమస్యల వల్ల ఆర్థికంగా వెనుకబడ్డామని చెప్పడంలో విఫలమయ్యాం. రైతులకు కూడా దూరమయ్యాం. అలా ఏదో ఒక కారణంతో ఆయా వర్గాల వోటర్లకు దూరమయ్యామని కేటీఆర్ తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఉన్న ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమికొట్టాం. ఫ్లోరోసిస్ కాంగ్రెస్ ద్రోహామేనని ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యాం. నల్లగొండ జిల్లాకు పదేండ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చామని చెప్పడంలో విఫలమయ్యాం. ఫెయిలైంది మన నాయకుడు కాదు.. తప్పు ప్రజలది కాదు. కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు. మనమేమో ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యాం.
ప్రజలేమో అబద్దాలకు మోసపోయారు. పదేండ్ల నిజం ముందు ఈ వంద రోజుల అబద్దం ప్రజలకు ఇవాళ కనబడుతుంది. ఏ ఊరికి మన నాయకులు పోయినా ఇట్ల అయితదని అనుకోలేదు. ఇంత మోసం జరుగుతుది అనుకోలేదని. ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. కేసీఆర్ సార్ మళ్లీ నువ్వ రావాలి. నువ్వున్నప్పుడే మంచిగ బతికినం అని ఓ రైతు కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ డియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ పాలన ప్రజలకు అర్థమైంది.. మనకు అర్థం కావాలి. మనం గట్టిగా పని చేస్తే ఫలితం వస్తుంది. 2018లో జిల్లా మొత్తంలో 12కి 11 గెలిచాం. నల్లగొండ పార్లమెంట్లో 6 గెలిచాం. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి స్థానాల్లో ఓడిపోయాం. ఇప్పుడు 11 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ఎంపీ నియోజకవర్గాల్లో ఎందుకు ఓడదో ఆలోచించి పని చేయండి. బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలను ప్రజలను సునిశితంగా గమనిస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు.