- తెలంగాణలో మళ్లీ కొరోనా నిబంధనలు
- గడప దాటితే వ్యాక్సినేషన్ ధృవీకరణ ఉండాల్సిందే
- బ్రిటన్ నుంచి వొచ్చిన మహిళకు కొరోనాగా నిర్ధారణ
- ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డా.శ్రీనివాసరావు
కర్నాటకలోని ఐఎన్ఎస్ఏసిఓజి ద్వారా కొరోనా వైరస్ ఓమిక్రాన్ వేరియంట్ రెండు కేసులు కనుగొనబడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇద్దరూ పురుషులని, వారి ప్రాథమిక, ద్వితీయ పరిచయాలు గుర్తించబడ్డాయని, పరీక్షించబడుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రతినిధి : ప్రపంచ దేశాలను కొరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ఇప్పటికే పలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన ప్రభుత్వం కొరోనా నిబంధనలను మళ్లీ అమలులోనికి తీసుకొచ్చింది. గురువారం రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డా.శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. కోవిడ్ కట్టడి చర్యలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వైద్యారోగ్య శాఖ అధికారులకు మార్గదర్శనం చేస్తున్నారని చెప్పారు. కొరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదనీ, ఎప్పుడైనా వొచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేననీ, గడప దాటి బయట అడుగుపెడితే కోవిడ్ వ్యాక్సినేషన్ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే, మాస్క్ ధరించని వ్యక్తికి రూ.1000 జరిమానా విధిస్తామనీ, ఈ నిబంధనను ప్రజలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించి కోవిడ్ బారిన పడకుండా కాపాడుకోవాలన్నారు. కోవిడ్ డెల్టా రకం కంటే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా విస్తరిస్తున్నదనీ, కేవలం మూడు రోజుల్లోనే మూడు నుంచి 24 దేశాలకు విస్తరించిన విషయాన్ని గుర్తు చేశారు. దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్ పక్రియ వేగంగా జరగని కారణంగానే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. రిస్క్ దేశాల నుంచి వొచ్చిన 325 మంది విదేశీ ప్రయాణికులకు కొరోనా పరీక్షలు నిర్వహించగా, బ్రిటన్ నుంచి వొచ్చిన 35 ఏళ్ల మహిళకు పాజిటివ్గా నిర్ధారణ అయిందనీ, ఆమెకు టిమ్స్లో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
జినోమ్ సీక్వెన్స్కి నమూనాలు పంపించామనీ, ఫలితాలు రావడానికి రెండు రోజుల సమయం పడుతుందన్నారు. కొరోనా ఇంకా పూర్తిగా అంతం కాలేదనీ రాష్ట్రంలో ప్రస్తుతం 25 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నట్లు డీహెచ్ తెలిపారు. ఇప్పటి వరకు 90 శాతం మందికి తొలి డోసు పూర్తి కాగా, 47 శాతం మందికి రెండు డోసులు పూర్తయినట్లు వెల్లడించారు. వైరస్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు ఉన్న ఆయుధం కేవలం టీకా మాత్రమేననీ, ప్రతీ ఒక్కరూ టీకా తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వం బాధ్యత అనీ, అయితే, ప్రభుత్వం చేపట్టే చర్యలకన్నా తమను తాము రక్షించుకునేందుకు ముందు జాగ్రత్తలు పాటించడమే ఏకైక మార్గమని ఈ సందర్బంగా డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.