బండి సంజయ్ పాదయాత్రలో రాళ్లదాడి, పలువురికి గాయాలు, కార్దు ధ్వంసం దేవరుప్పుల మండల కేంద్రంలో టీఆర్ఎస్, బిజెపి కార్యకర్తల మధ్య దాడులు, ప్రతిదాడులు నెలకొనడం జరిగింది.పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ చేపట్టిన మహాసంగ్రామ యాత్రలో టీఆర్ఎస్, బిజెపి నాయకులు ఒకరిపై ఒకరు దూషణలు, ప్రతిదూషణలకు దిగడంతో రాళ్లదాడికి దారితీసింది.దీంతో పోలీసులు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్దితి చోటుచేసుకుంది.ఒక సందర్బంగా పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేయలేని పరిస్దితి నెలకొంది.దీంతో పోలీసులు ఇరు వర్గాలను తోసివేయడం జరిగింది.సోమవారం బిజెపి రాష్ట్రఅధ్యక్షులు చేపట్టిన మూడవ మహాసంగ్రామ యాత్రలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండల కేంద్రానికి చేరుకుంది.
బండి సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశలో ఆయన ప్రసంగిస్తు టీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలివ్వకుండా మోసం చేస్తుందని మాట్లాడుతుండగా అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం చెప్పారు.సీఎంకేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు తగదని నినాదాలు చేస్తు మోదీ డౌన్ డౌన్ అనడంతో బిజెపి కార్యకర్తలు ఎదురు దాడికి దిగడం జరిగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.దీంతో టీఆర్ఎస్ నాయకులు, బిజెపి ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు.రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్నాయి.విషయం తెలుసుకున్న డీసీపీ సీతారాం రంగ ప్రవేశం చేశారు. వెంటనే శాంతి భద్రతలను కాపాడాలని డీసీపీ ఆదేశాలు జారీ చేయడంతో సీఐ చేరాలు ఆద్వర్యంలో పోలీస్లు ఇరు వర్గాలను చెదరగొట్టారు.పోలీసులు అదుపు చేస్తున్న తరుణంలోనే ఇరు వర్గాలు దాడి చేసుకోవడంతో టీఆర్ఎస్ నాయకులు కోతి ప్రవీణ్, ఘనపాక రమేష్, వడ్లకొండ శ్రీకాంత్, గాదెర శ్రీకాంత్, గొడిశాల పద్మలకు గాయాలయ్యాయి వీరిని వెంటనే చికిత్స నిమిత్తం జనగామలో ఓ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా బిజెపి కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయని ఆరోపించడం గమనార్హం.
టీఆర్ఎస్కు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీస్
రాష్ట్రంలో పోలీసులు టీఆర్ఎస్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బిజెపి నాయకులపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని రాష్ట్ర డీజీపీకి ఆయన ఫిర్యాదు చేశారు.శాంతి కాపాడంలో పోలీసులు విఫలమయ్యారని దాడులు జరుగుతాయని తెలిసుండి కూడా అదుపు చేయలేదని విమర్శించారు.వెంటనే పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.