(బి.సి.రాయ్ జయంతి మరియు వర్థంతి సందర్భంగా)….
ప్రతి వృత్తీ దేనికదే సాటి అయినప్పటికీ వైద్య వృత్తి మిగిలిన వాటికి భిన్నమైనది. మృత్యువు చివర అంచులదాకా వెళ్ళిన వారికి ప్రాణం పోసే శక్తి ఈ వృత్తికి ఉంటుంది. అందుకే రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసే నిరంతర సేవకు ఈమాత్రం గుర్తింపుగా ప్రతి సంవత్సరము జూలై 1 వ తేదీన డాక్టర్స్ డే ని జరుపుకుంటారు. ప్రాణ ప్రదాతలను గుర్తు పెట్టుకునేందుకు ఈ రోజున డాక్టర్లందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో చల్లగా ఉండాలని దేవుని ప్రార్ధించి శుభాకాంక్షలు తెలియ జేస్తారు. అలా తెలియ జేసేందుకు సంవత్సరములో ఒకరోజు కేటాయించ బడింది. బెంగాల్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పనిచేసిన బిధాన్ రాయ్.. రాష్ట్రంలో అనేక వైద్య సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. జాధవ్పూర్ టీబీ ఆస్పత్రి, చిత్తరంజన్ సేవా సదన్, కమలా నెహ్రూ మెమోరియల్ ఆస్పత్రి, విక్టోరియా ఇన్స్టిట్యూషన్, చిత్తరంజన్ క్యాన్సర్ ఆస్పత్రి, చిత్తరంజన్ సేవా సదన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ తదతర ప్రతిష్టాత్మక సంస్థలన్నీ ఆయన హయాంలో పురుడు పోసుకున్నవే. మహిళలకు సామాజిక సేవ, నర్సింగ్లో శిక్షణ ఇప్పించడానికి ఆయన ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలకత్తా నగరానికి మేయర్ (1931-33)గానూ బిధాన్ రాయ్ పని చేశారు. స్థానిక పరిపాలనలో కీలక సంస్కరణలు తీసుకు వచ్చారు. కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్స్లర్(1942-44)గా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ (1939)గా, ఉత్తర ప్రదేశ్ గవర్నర్గానూ ఆయన విశేష సేవలు అందించారు. 1882 జులై 1న జన్మించిన బిధాన్ రాయ్ 1962లో అదే రోజున (జులై 1) మరణించడం గమనార్హం.
1933 లో జార్జియ లోని విండార్ లో మార్చి 30 వ తేదీన తొలి డాక్టర్స్ డే ని పాటించారు . డా.చార్లెస్ బి.ఆల్మండ్ భార్య బ్రౌన్ ఆల్మండ్ వైద్యుల గౌరవార్ధము ఒక రోజును కేటాయించాలని నిర్ణయించింది. గ్రీటింగ్ కార్డులు పంపడం, అసువులు బాసిన వైద్యులకు పూలతో నివాళులర్పించడం ద్వారా తొలి డాక్టర్స్ డే ఉత్సవం జరిపారు. యునైటెడ్ స్టేట్స్ లో ప్రతినిధుల సభ డాక్టర్స్ డే పాటిస్తూ1958 మార్చి 30 వ తేదీన తీర్మానం చేసింది. 1990 లో నేషనల్ డాక్టర్స్ డే పాటించాల్సిందిగా చట్టాన్ని ప్రవేశ పెట్టారు. 1990 అక్టోబర్ 30 న అధ్యక్షుడు జార్జి బుష్ మార్చి 30 న ‘నేషనల్ డాక్టర్స్ డే’ గా పేర్కొంటూ చట్టం పై సంతకాలు చేశాడు. మన భారత దేశములో ప్రతియేటా జూలై 1 న నేషనల్ డాక్టర్స్ డే ని జరుపు కుంటున్నాము. ప్రముఖ వైద్యుడు డా. బి.సి.రాయ్ గౌరవార్ధం ఈ రోజును నిర్ణయించారు. రాయ్ 1882 జూలై 01 న జన్మించినారు. మన దేశంలో వైద్య రంగానికి ఎనలేని సేవలందించిన ఆ మహా మహుని జన్మదిన వేడుకలే డాక్టర్స్ డే ఉత్సవాలుగా జరుపు కుంటున్నాము. ఆయన పుట్టినరోజు .. మరణించిన రోజు ఒక్కరోజే .. అదే జూలై 1 వ తేదీ . 1962 జూలై 1 వ తేదీన మృతి చెందారు. డాక్టర్ బి.సి.రాయ్ 1882 వ సంవత్సరం జూలై ఒకటవ తేదీన బీహార్ రాష్ట్రం ,పాట్నా జిల్లాలోని బకిమ్ పూర్ లో జన్మించారు. ఆయన పూర్తి పేరు బిధాన చంద్ర రాయ్. తండ్రి ప్రకాశ్ చంద్ర ఎక్సైజ్ ఇనస్పెక్టర్. బి.సి .రాయ్ తోబుట్టువులు ఐదుగురు. తన 14వ యేట నే తల్లిని కోల్పోయారు. అవివాహితుడైన బి.సి.రాయ్ తన ఆస్తులతో పాట్నాలో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక సేవలకు అంకితం చేసారు .
బిధాన చంద్ర రాయ్ 1909-11 మధ్య కాలంలో ఇంగ్లండ్ లోని సెంట్ బెర్త్ లోమో కాలేజీలో ఎంఆర్సిపి మరియు ఎఫ్ఆర్సిఎస్ అనే డిగ్రీలు పొందడానికి చదువు కొనసాగించి, 1911 లో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, కోల్ కతా మెడికల్ కాలేజీలో కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేసారు. ఆయన నజాదవ్ పూర్ టి.బి.హాస్పిటల్, ఆర్.జి.ఖార్ మెడికల్ కాలేజీ, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూట్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ మొదలైన సంస్థలు నెలకొ ల్పారు.1926 లో ప్రత్యేకంగా మహిళల కోసం, పిల్లల కోసం చిత్తరంజన్ సేవాసదన్ అనే వైద్య శాలను ఏర్పాటు చేసారు. మహిళలకు నర్సింగ్ శిక్షణ కోసం ఒక శిక్షణా సంస్థనూ ఏర్పాటు చేసారు. రాయ్ మహాత్మా గాంధీ వ్యక్తిగత వైద్యులలో ఒకరు. దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వైద్య మండలి సభ్యులుగా కూడా ఆయన ఉన్నారు.
1925 లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బారక్ పూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ‘‘గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బెంగాల్’’ గా పేరొందిన సురేంద్రనాధ్ బెనర్జీని ఓడించారు..1922-28 ల మధ్య కాలంలో కోల్ కతా మెడికల్ జర్నల్ కు సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. 1928 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులైనారు. కోల్ కతా నగరానికి మేయర్ గా ఎన్నికైనారు. 1942 లో కోల్ కతా విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా, 1943 లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షులుగా నియమింప బడ్డారు. విద్య, వైద్య రంగాలలో ఆయన సేవలకు 1944 లో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయ బడింది. 1948 జనవరి 13 న పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి పదవిని చేపట్టారు.1961 లో ఫిబ్రవరి 4 న ఆయనను భారత రత్న వరించింది. రాయ్ జయంతి రోజైన జూలై ఒకటినే వర్ధంతి కూడా కావడం విశేషమైనందున ఆయన స్మారకార్ధం ప్రతీ ఏడూ జూలై ఒకటవ తేదీన వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1962 లో ప్రకటించింది. వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి 1976 నుంచి డాక్టర్ బి.సి.రాయ్ పేరు మీద అవార్డులను ప్రధానం చేస్తున్నారు. నేటి వైద్యులకు, వైద్య విద్యార్ధులకు ఆదర్శప్రాయులు డా.బి.సి.రాయ్. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది. నిబద్దత, త్యాగనిరతి వైద్యులకు ఉండాలి. తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టేసి తెల్లకోటుకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎదుటి వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి తపన పడేవారే నిజమైన వైద్యులు. మానవ సేవే మాధవ సేవ అన్నట్లు సాగే వైద్య వృత్తిలో ఎంతగా సేవా నిరతి కలిగి ఉంటే అంతటి గొప్పవ్యక్తిగా గుర్తింపు. డాక్టర్లకు సహనము, ఓర్పు, సేవానిరతి, దయ ఉండాలి.
వైద్యుడు ఎల్లప్పుడు అన్నివేలలా రోగులకు అందుబాటులో ఉండాలి. ఏ అత్య వసర పరిస్థితిలోనైనా తనకు వైద్యం చేసే డాక్టర్ అందుబాటులో ఉన్నాడన్న , ఉంటాడన్న నమ్మ కము రోగికి కలిగేటట్లు వైద్యులు మెలగాలి. తను చేస్తున్న వృత్తి మీద వైద్యులకు అబిరుచి, నమ్మకము ఉండాలి. ఏదో జీవనోపాధి కోసం పనిచేయకూడదు. తను చేస్తున్న పనికి ఒక క్రమబద్దత ఉండాలి. నిర్దిష్ట మైన సమయ సారిణి ఉండాలి. ప్రతి డాక్టరూ ఎల్లప్పుడు రోగికి మంచి చేయాలనే ఆలోచించాలి. ఫీజు తీసుకున్నా, తీసుకోక పోయినా తను చేసే సేవ ఒకేలా ఉండాలి. రోగికి, వైద్యునికి మధ్య నమ్మకం అనే బంధము ఉండాలి.
– రామ కిష్టయ్య సంగనభట్ల…
9440595494