- స్పౌజ్ బదిలీల కోసం నినదించిన ఉపాధ్యాయులు
- బోనాలు సమర్పించిన మహిళా టీచర్లు
- మిగిలింది ప్రగతి భవన్ ముట్టడేనని సంఘాలు వెల్లడి
ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : ఉపాధ్యాయ దంపతుల బదిలీలు కోసం ధర్నా చౌక్లో నిర్వహించిన ఆవేదన సభ స్పౌజ్ బదిలీలు జరపండనే నినాదాలతో దద్దరిల్లింది. 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే జరపాలని సోమవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్లో 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు ఆవేదన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 13 జిల్లాల నుంచి ఉపాధ్యాయ దంపతులు వందలాదిగా తరలివచ్చారు. వారితో పాటు వారి పిల్లలు, వయోధికులైన తల్లిదండ్రులు కూడా ఈ ఆవేదన సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే చేపట్టాలని.. భార్య ఒక జిల్లాలో, భర్త మరొక జిల్లాలో 18 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నామని వారు ఆవేదన చెందారు. తమ ఆవేదన దీక్షను గమనించైనా ప్రభుత్వం వెంటనే స్పందించి స్పాజ్ బదిలీలు జరిపించాలని అభ్యర్థించారు.
బోనాలతో తెలంగాణ అంతటా పండుగ వాతావరణం ఉన్న ఈ సందర్భంలోనూ తమ బదిలీలు జరగక ఆవేదనలో ఉన్నామని, అమ్మవారికి ప్రత్యేక బోనాలను తయారు చేయించి..మహిళా ఉపాధ్యాయులు ర్యాలీగా అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఆషాడం బోనాల సందర్భంగా ఆయనా అమ్మవారి దయ మాపై కురిపించి బదిలీలను వెంటనే జరిపించాలని ఆవేదన సభ సాక్షిగా మహిళా ఉపాధ్యాయులు వేడుకున్నారు. దంపతుల బదిలీలు జరగకపోవడంతో భర్త ఒక జిల్లాలో, భార్య మరొక జిల్లాలో విధులు నిర్వహించాల్సిన దారుణ పరిస్థితులు దాపురించాయని, కుటుంబాలుగా విడిపోయి, పిల్లలను చూసుకోలేక, వయోదికులైన తల్లిదండ్రులను చూసుకోలేక, దంపతులుగా విడిపోయి నరకయాతన అనుభవిస్తున్నామని వారు ఆవేదన చెందారు. ఆవేదన సభకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. యుటిఎఫ్, టిపిటిఎఫ్, తపస్, ఎస్టీయు, ఆర్.యుపిపి తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి చేరుకొని తమ మద్దతును ప్రకటించారు.
ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని వరింత తీవ్రతరం చేస్తామని, అవసరమైతే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని, ప్రగతి భవనం ముట్టడించడానికి కూడా వెనకాడమని స్పష్టం చేశారు. దంపతుల బదిలీలను వెంటనే చేపట్టాలని స్పౌజ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వివేక్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ కుటుంబాలు స్పౌజ్ బదిలీలు జరగకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని, ప్రభుత్వం వారు పెద్ద మనసుతో ఈ సమస్య పరిష్కరించాలని అభ్యర్థించారు. ఒకటి రెండు క్యాడర్లు మినహా మిగతా అన్ని విభాగాల్లోనూ స్పౌజ్ బదిలీలు నిర్వహించడానికి 13 జిల్లాల్లో అవకాశం ఉందని సభ్యులు నరేష్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయ దంపతుల సమస్యను సానుకూల దృక్పథంతో స్వీకరించి వెంటనే పరిష్కారం చూపించాలని అభ్యర్థించారు.