- మనమంతా ఇందుకు కృషి చేయాల్సిందే
- హ్యూమన్ ట్రాఫికింగ్పై పుస్తకావిష్కరణలో గవర్నర్ తమిళిసై
- రచయిత సునీతా కృష్ణన్ కృషిని అభినందించిన గవర్నర్
హ్యూమన్ ట్రాఫికింగ్ ఫర్ డ్యూటీ బేరర్స్ పుస్తకాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు. ప్రపంచ వ్యక్తుల ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గవర్నర్ శుక్రవారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో హ్యాండ్ బుక్స్ ప్రచురణలో ఈ పుస్తకం వొచ్చింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..మానవ అక్రమ రవాణా కట్టడికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్రమ రవాణా ద్వారా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నారు. బాధితులను వివక్షకు గురిచేయకుండా పునరావాసానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజ్వల సంస్థ ద్వారా సునీతా కృష్ణన్ కృషి అభినందనీయం పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా అవతరించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మానవ అక్రమ రవాణా ద్వారా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, అమాయకుల జీవితాలు బలి అవుతున్నాయని గవర్నర్ ఆవేదన చెందారు. మొత్తం మానవ అక్రమ రవాణాలో 46 శాతం మంది మహిళలు, 19 శాతం మంది అమ్మాయిలు బాధితులు అవుతున్నారని ఆమె అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఏ సమయంలోనైనా కనీసం రెండున్నర మిలియన్ల మంది ఈ మానవ అక్రమ రవాణాలో బాధితులు జీవితాలను గడుపుతున్నారని డాక్టర్ తమిళిసై సమస్య తీవ్రతను వివరించారు. మానవ అక్రమ రవాణా నుండి కాపాడబడిన బాధితులను వివక్షకు గురి చేయకుండా వారి రిహాబిలిటేషన్కు కృషి చేయాలని గవర్నర్ సూచించారు. బాధితుల సమస్యలను, అనుభవాలను ఆకళింపు చేసుకోవడం ద్వారా మానవ అక్రమ రవాణా ఎలా అరికట్టాలి సరైన ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరముందని గవర్నర్ వివరించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ ప్రజ్వల సంస్థ ద్వారా చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. యూఎస్ కాన్సులేట్ సహాయంతో ప్రచురించిన ఈ హ్యాండ్ బుక్స్ను ఉపయోగించుకొని బాధ్యత గల అధికారులు, సివిల్ సొసైటీ సభ్యులు మానవ అక్రమ రవాణా అరికట్టడానికి కృషి చేయాలని గవర్నర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సునీతా కృష్ణన్తో పాటు యూఎస్ కాన్సులేట్కు చెందిన అధికారులు, గవర్నర్ సెక్రటరీ కే. సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.