ప్రతీకార చర్యలతో భయభ్రాంతులకు గురవుతున్న గిరిపుత్రులు
ప్రతీకారం తీర్చుకుంటామంటున్న రాష్ట్ర ప్రభుత్వం
మందుపాతర బాధ్యత మాదే : లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : మందుపాతర మోతలతో దండకారణ్యం మరోసారి గిరిపుత్రుల్లో దడ పుట్టించింది. మావోయిస్టు పార్టీ ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలకు మాత్రమే బాధ్యులయ్యారు. బుధవారం దంతెవాడ జిల్లా ఆరెన్పూర్ అటవీ ప్రాంతంలో శక్తివంతమైన మందుపాతరను పేల్చి 11 మంది మృతికి కారకులయ్యారు. లేఖ విడుదల చేసిన వారం రోజులకే ప్రతీకారచర్య చేపట్టారు. దీనితో ఛత్తీస్ఘఢ్ రాష్ట్రానికి సవాల్ విసిరినట్టు అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేకమంది పోలీస్ బలగాలను రంగంలోకి దింపింది. నిత్యం ఛత్తీస్ఘఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉంటాయి. ఈ గాలింపు చర్యలను నిలిపివేయాలని మావోయిస్టులు కూడ హెచ్చరికలు జారీ చేస్తారు. ఇటువంటి హెచ్చరికలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. కానీ మావోయిస్టులు ఇంత భారీ మొత్తంలో జవాన్లను హతమార్చడంతో ఛత్తీస్ఘఢ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. తప్పనిసరిగా ప్రతీకారచర్య తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరించారు. మావోయిస్టు పార్టీలను ఏరివేసేందుకు గతంలో సల్వాజుడుం పేరుతో గిరిజన యువకులను తీసుకుని వారికి ట్రైనింగ్ ఇచ్చి మావోయిస్టులను ఏరివేసేందుకు అటవీ ప్రాంతంలోకి కూంబింగ్కు పంపించేవారు. సల్వాజుడుంను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మహేంద్ర ఖర్మ నాయకుడు సల్వాజుడుంను ఏర్పాటు చేసి పోలీస్ బలగాలకు మద్దతుగా అటవీ ప్రాంతంలోకి పంపించేవారు. అదే తరహాలో బిజెపి ప్రభుత్వం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులుగా నియమించి వీరికి శిక్షణ ఇచ్చి తుపాకులతో అటవీ ప్రాంతంలోకి కూంబింగ్కు పంపిస్తున్నారు. మినీ వాహనంలో కూంబింగ్ నిర్వహించుకుని తిరిగి వొస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పసిగట్టి మందుపాతర పేల్చి 11 మంది డిఆర్జె జవాన్లను హతమార్చారు.
ఈ సంఘటనపై మళ్ళీ దండకారాణ్యంలో తీవ్ర భయాందోళన ఏర్పడింది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులను మావోయిస్టులు ఆధీనంలో ఉంచుకున్నట్లు తెలుస్తుంది. మందుపాతర సంఘర్షణతో పోలీస్ బలగాలు వేగం పెంచారు. అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. గతంలో మావోయిస్టుల కోసం పోలీస్ బలగాలు టీమ్లుగా ఏర్పడి అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టేవారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో మావోయిస్టులను పసిగట్టేందుకు అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలను పంపించి మావోయిస్టుల స్థావారాలను కనిపెడుతున్నట్లు తెలుస్తుంది. ప్రతీకారచర్యలతో అమాయక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.
ఆరెన్పూర్ మందుపాతర పేల్చిన ఘటనలో మహిళా మావోయిస్టు మంజుల కీలకపాత్ర
ఛత్తీస్ఘఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా ఆరెన్పూర్ అటవీ ప్రాంతంలో డిఆర్జి జవాన్లు కూంబింగ్ నిర్వహించుకుని మినీ వాహనంలో వస్తున్న డిఆర్జి జవాన్లను మందుపాతరతో పేల్చి హతమార్చిన సంఘటనలో మావోయిస్టు మహిళ నాయకురాలు మంజుల అని తెలుస్తుంది. మంజుల మావోయిస్టు పార్టీ దర్బా విభాగానికి చెందిన సభ్యురాలుగా తెలుస్తుంది. ఈ ఘటనలో దర్బా మిలటరీ దళం ఛీఫ్ పాల్గొనట్లు తెలుస్తుంది.