న్యూ దిల్లీ, సెప్టెంబర్ 15(ఆర్ఎన్ఎ) : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీ కోర్టులో ఊరట లభించింది. కవితకు ఈ నెల 26వ తేదీ వరకు సమన్లు జారీ చేయొద్దని ఈడీని సుప్రీమ్ కోర్టు ఆదేశించింది. నళినీ చిదంబరం తరహాలోనే తమకూ ఊరట కల్పించాలని కోర్టును కవిత కోరారు. కవిత పిటిషన్పై సుప్రీమ్ కోర్టు ధర్మాసనం ఈడీ న్యాయవాది స్పందన కోరింది. తమకు అభ్యంతరం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 26వ తేదీ వరకు సమన్లు జారీ చేయొద్దని జస్టిస్ కౌల్ ధర్మాసనం ఆదేశించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఈడీ పేర్కొంది. దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంటివద్దే విచారించాలని, సమయపాలన పాటించాలని కోరుతూ కవిత సుప్రీమ్ కోర్టులో వేసిన పిటిషన్పై విచారణ ఇంకా కొనసాగుతున్నది. ఈడీ ముందు కవిత ఇప్పటికే మూడుసార్లు హాజరై విచారణ ఎదుర్కున్నారు.