- ఉత్తర్వులు జారీ చేసిన స్పీకర్ ఓం బిర్లా
- వెంటనే లోక్సభకు హాజరు అయిన రాహుల్
- పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళి
- ఘనంగగా స్వాగతించిన కాంగ్రెస్ ఎంపిలు
- అవిశ్వాసం చర్చలో పాల్గొనేలా కాంగ్రెస్ ప్లాన్
న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,ఆగస్ట్7: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై విధించిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు సోమవారం లోక్సభ ప్రకటించింది. మోడీ ఇంటి పేరు కేసులో రాహుల్కు విధించిన రెండేళ్ల జైలు శిక్ష సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీని లోక్సభ సెక్రటేరియట్కు అధికారికంగా అందజేసినట్లు లోక్సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. మోడీ ప్రభుత్వంపై ఆగస్ట్ 8న నిర్వహించనున్న అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొనేందుకు రాహుల్గాంధీని అనుమతిం చాలని అన్నారు. తాజా నిర్ణయంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొనసాగనున్నారు. ఎంపీగా ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని లోక్సభ సెక్రటేరియేట్ పునరుద్ధరించింది. ఈ మేరకు సోమవారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా.. ’మోదీ ఇంటిపేరు’ కేసులో రెండేళ్ల జైలుశిక్షను రాహుల్ గాంధీ సవాలు చేయడంతో ఆగస్ట్ 4న సుప్రీంకోర్ట్ స్టే విధించింది. సుప్రీంకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో రాహుల్పై అనర్హత ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియేట్ స్పష్టం చేసింది.
సుప్రీంకోర్ట్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన ఎంపీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాహుల్ గాంధీకి పార్లమెంట్ సెక్రటేరియేట్ సమాచారం అందించింది. పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణవ్వడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ దాదాపు 4 నెలల తర్వాత పార్లమెంట్కు వచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం భవనంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పార్లమెంట్లోకి సాదరంగా ఆహ్వానం పలికారు. కాగా రాహుల్పై అనర్హత వేటును నిలుపుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీ కీలకమవుతాయని పేర్కొంది. మణిపూర్లోని హింసాత్మక ప్రాంతాల ను రాహుల్ సందర్శించడం చర్చలో ఉపయుక్తంగా ఉంటుందని పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది.
రాహుల్ గాంధీ లోక్సభకు చేరుకోగానే బీజేపీ మాటల దాడి మొదలుపెట్టింది. కాంగ్రెస్కు అందుతున్న నిధులపై దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. చైనా నుంచి నిధులు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. న్యూస్క్లిక్ సంస్థకు డబ్బు అందిందని న్యూయార్క్ టైమ్స్ రాసిందని ఆరోపించారు. ఈడీ దాడులపై దుష్పచ్రారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా.. ’మోదీ ఇంటిపేరు కేసులో’ దోషిగా తేలిన రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ మార్చి 23న గుజరాత్ కోర్ట్ తీర్పునిచ్చింది. ఆ మరుసటి రోజు మార్చి 24న రాహుల్పై అనర్హతవేటుపడింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని నిబంధనల ప్రకారం పార్లమెంట్ సెక్రటేరియేట్ ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో గుజరాత్ హైకోర్టును ఆశ్రియించినా రాహుల్కు ఊరటదక్కలేదు. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించగా ఊరటదక్కింది. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ పునరుద్ధరణ పక్రియ సోమవారం జరిగింది. ఇటీవలే సుప్రీంకోర్టు ఆయనపై పరువునష్టం దావాలో జైలుశిక్షపై స్టే విధించింది.ఈ క్రమంలో ఆయన ఎంపి స్థానం తిరిగి దక్కేందుకు రంగం సిద్ధం అయ్యింది.
సోమవారం స్పీకర్ ఓం బిర్లా సంబంధిత పక్రియకు తమ అధికారిక సమ్మతి ఇచ్చారు. రాహుల్ సీటు పునరుద్ధరణపై ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పెట్టేందుకు, స్పీకర్పై ఒత్తిడి తెచ్చేందుకు సంఘటిత విపక్షం ఇండియా కూడా రంగంలోకి దిగింది. ఇకపోతే గుజరాత్లోని సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు కూడా అవకాశం కల్పించింది. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రేండేళ్ల జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై కాంగ్రెస్ స్పందించింది. దీంతో రాహుల్ ఎంపి హోదా పునరుద్ధరణకు అవకాశం ఏర్పడనుంది. సత్యమేవ జయతే అని ట్విటర్లో పేర్కొంది. ఈ విజయం ద్వేషంపై ప్రేమ సాధించిన విజయం. సత్యమేవ జయతే.. జై హింద్ అని ట్వీట్ చేసింది. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.