“దోషులకు దండం పెట్టి దండలెయ్యాల్సిన దుర్గతి పట్టుతుందని నిజాయితి పరులైన అధికారుల ఆవేదన అరణ్య రోదనగా మారుతున్న సంఘటనలు కోకొల్లలు. సమస్త పాలన వ్యవస్థల్ని అవినీతి కూపంలో ముంచేసిన వారిని, నేర చరితులని పార్టీలు అభ్యర్థులుగా నిలబెట్టడమే కాదు ! వారికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న పాలకుల తీరు ఏ విలువలకు నిదర్శనమనాలి. ఈ రెండు మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించినవారే సొంతంగా పార్టీలు పెట్టి అధికార పీఠాన్ని అధిరోహిస్తున్న వారిని చూస్తున్నాం. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్లగాని నేతల జవాబుదారీతనం ఎండమావిలో నీళ్లను వెతుక్కున్నట్లుగానే ఉంది.”
డా।। అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ సభలో ఉద్విగ్నంగా వెలిబుచ్చిన సందేహాలే నేడు దర్శనమిస్తున్నాయి. భారత జాతికి ఒకే విలువగల ఓటు హక్కును కల్పించుకున్నాము. కానీ ఆర్థిక, సామాజిక, రాజకీయ, స్వేచ్ఛ సౌభ్రాతృత్వాల్లో సమానతను సాధించాల్సిన బాధ్యత మన పాలకులపైనే ఉంది. నా దేశం తన స్వాతంత్య్రాన్ని రక్షించుకుంటుందా ! పరాభవం పాలౌతుందా ! రాజ్యాంగం సుధీర్ఘకాలం నిలుస్తుందా ! స్వతంత్ర ప్రతిపత్తినిచ్చిన సంస్థలు… న్యాయశాఖ, పత్రికా స్వేచ్ఛ, నిఘా విభాగాలు, ఎన్నికల సంఘం వీటిని నాయకులు స్వతంత్రంగా పనిచేయనిస్తారా ! రాజకీయ ప్రలోభాలకు లోనౌతారూ అనే ఆంధోళనతో కూడిన సందేహాలను వ్యక్తపరిచారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన పత్రిక స్వేచ్ఛగల్గిన మీడియా సంస్థలు పాలక, కార్పోరేటు సంస్థల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి. ఎన్నికల సంఘం ధన, కండ •లాన్ని నియంత్రించలేక పోతుంది. రాజ్యాంగం కల్పించబడిన చట్టసభల విశిష్ట అధికారాలను అడ్డుపెట్టుకొని ప్రజా ప్రతినిధులు కూడా కార్పోరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తుంటే? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ! అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నధన స్వామ్యమే ? నాయకుడంటే ఒకప్పుడు నైతిక విలువలకు కట్టుబడి మాటపై నిలబడేవాడు. ఇప్పుడు అవినీతి డబ్బుల కట్టల(కండబలం)తో బెదిరిస్తూ ఓటును కొనేవాడు ఇంత విచ్చలవిడిగా డబ్బులు పంచే నాయకులను పార్టీలను వదిలేసి, ఓటర్లను అమ్ముడు పోతున్నారని నిందించడం భావ్యమా !