- దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది
- త్వరలోనే బీసీ గర్జన…జనాభా త్రిపదికన బీసీలకు రిజర్వేషన్లు
- పిసిసి మాజీ అధ్యక్షుడు వి.హనుమంత రావు
సంగారెడ్డి , ప్రజాతంత్ర, జులై 18 : ‘కేసీఆర్ మమ్మల్ని బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారు.నువ్వెందుకు వేస్తావు. జనం వేస్తారు నిన్నే భంగళాఖాతంలో…సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే నాంపల్లి దర్గా దగ్గర అల్లాకే బాబా దేదో అనే అడుకునే వాడివి. అన్నం పెట్టినోనికి సున్నం పెడతడు కేసీఆర్.’’ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంత రావు అన్నారు. బుధవారం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల(బీసీ ఐక్య వేదిక) ఓబీసి సమావేశం జరిగింది. సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంత రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా విహెచ్ మాట్లాడుతూ…బీసీలకు, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని చెప్పడంతో బీజేపీ వెన్నులో వణుకుపుట్టింది అన్నారు. కులాల పేరుతో మనం కొట్టుకోకుండా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలన్నారు. పేదల గురించి ఆలోచించే కుటుంబం గాంధీ కుటుంబం అని తెలిపారు. పేదలకు భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ-మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, గారిబీ హటావో అనే నినాదం తో పేద ప్రజలకు సేవ చేసింది కాంగ్రెస్ పార్టీయే అని వివరించారు. రాష్ట్రంలో బీసీ ల భారీ బహిరంగా సభ ఉంటుందని ప్రకటించారు. ఈ సభకు రాహుల్ గాంధీ గారు వస్తారని తెలిపారు.ఎప్పుడు సభ ఉంటుంది అనేది మళ్ళీ వచ్చి చెప్తానని అన్నారు.ఈ సభను అందరు సక్సెస్ చేయాలన్నారు. గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. చిన్న చిన్న కోపాలు పక్కన పెట్టి పని చేద్దాం అని కోరారు.దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిందని అన్నారు. పప్పు అన్న మా రాహుల్ పప్పా అయ్యాడు…మీ బాబై కూర్చున్నాడు ఎద్దేవా చేశారు. ఈ సారి ప్రధాని రాహుల్ అవుతాడు..లేకుంటే నా పేరు హనుమంతరావు కాదు అని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
ఆదానికి మోడీకి ఎం సంబంధం అని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని అన్నారు. మా దగ్గర ఉంటే అవినీతి పరులు…బీజేపీలో చెరితే సత్యహరిచంద్రులా అని ప్రశ్నించారు. త్వరలోనే బీసీ గర్జన పెడుతం..అందుకు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అందరూ ఒప్పుకున్నారని తెలిపారు.అగ్ర కులాలకే కాదు రిక్షా తొక్కేవాడికి కూడా టాలెంట్ ఉంటుందని అన్నారు. అగ్రకులాల వాళ్ళు ఓబిసిలను అనగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ జోడో యాత్రలో అన్ని వర్గాల వారిని కలిశారని తెలిపారు. కొందరు లేస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అంటున్నారని, ఫస్ట్ 27 శాతం తెచ్చుకుందాం.. ఆ తర్వాత 50 శాతం గురించి ఆలోచిద్దాం అని అన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అడుగుతున్నామని, నేనెవ్వరికి వ్యతిరేకం కాదు మా హక్కుల కోసం మేం పోరాడుతున్నామని అన్నారు.
ఫైనల్గా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మాటా వింటానని అన్నారు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ చెప్పి రైతులను జైల్లో వేయిస్తున్నాడని అన్నారు.పార్టీలో సీనియర్లు జూనియర్ల మధ్య చిన్న చిన్న గోడవలున్నాయని, సీనియర్ మీద జూనియర్ పెత్తనం చెలాయిస్తా అంటే ఉరుకుంటారా..? మా పార్టీలో లొల్లి కూడా అంతే…అని అన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల తరుపున నేను మాట్లాడుతా.. పార్టీ లోకి ఎవరైనా రానివ్వండి అలాగే పార్టీ కోసం జెండా మోసినవరిని పార్టీ మర్చిపోదు అని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ లు గాలి అనిల్ కుమార్,సంగీశెట్టి జగదీశ్, జనరల్ సెక్రటరీ లు లక్ష్మణ్ యాదవ్, చేర్యాల ఆంజనేయులు,మాజీ గ్రంధాలయ చైర్మన్ తోపాజి అనంతకిషన్, నారాయణఖేడ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇతర నేతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.