- దళిత ముఖ్యమంత్రి హామిని విస్మరించారు
- అంబేడ్కర్ విగ్రహస్థాపనలో తీరని నిర్లక్ష్యం
- జయంతి నాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నివాళి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించే తీరిక కూడా సిఎం కెసిఆర్కు లేకుండా పోయిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కూడా నిర్వహించడం లేదన్నారు. దళిత సిఎం అన్న కెసిఆర్ తానే పదవిలో కొనసాగుతూ దళితులను అవమాన పరిచారని అన్నారు. బిజెపి పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్,విజయశాంతి, వివేక్ తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ అంబేద్కర్కు నివాళులర్పించడానికి.. సీఎం కేసీఆర్కు రెండు నిమిషాల సమయం లేకపోవడం బాధాకరమని, పబ్లిక్ మిటింగ్లకు మాత్రం సమయం ఉంటుందని విమర్శించారు. ముఖ్యమంత్రికి దళిత సంఘాలు భయపడుతున్నాయని అన్నారు. 150 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి.. సీఎం కేసీఆర్కు ఉన్న ఇబ్బంది ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను మోడీ చేపట్టారని సంజయ్ పేర్కొన్నారు. దళితులు ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకోవాలని వారికి రుణ సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని కొనియాడారు.
అంబేద్కర్, ఇతర మహనీయుల జయంతి, వర్దంతిలకు కేసీఆర్ ఎందుకు హాజరు కావడం లేదు… సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లక్ష మందితో ఎన్నికల సభ పెట్టేందుకు టైం దొరుకుతుంది కానీ.. అంబేద్కర్కు నివాళులు అర్పించేందుకు టైమ్ దొరకడం లేదా అని నిలదీశారు. తెలంగాణను పాలించే అర్హులైన దళితులు పార్టీలో లేరా అని నిలదీశారు. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. గడీల పాలనలో ఉన్న తెలంగాణ తల్లికి విముక్తి కలిగిద్దామని పిలుపు ఇచ్చారు బండి సంజయ్. ఒకే కుటుంబం రాజ్యం ఏలుతోంది… సమాజం మేల్కొనాలి.. ఏ ఆశయం కోసం తెలంగాణ సాదించుకున్నామో దాని కోసం పని చేద్దామని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశంలో పాలన జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు.
అంబేద్కర్ను కాంగ్రెస్ పట్టించుకోలేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. సీఎం కుర్చీని ఎడమ కాలి చెప్పుతో సమానం అన్న.. కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని మండిపడ్డారు. కేసీఆర్ అహంకారాన్ని దళితులు గుర్తుపెట్టుకోవాలన్నారు. కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల పాలనకు చరమగీతం పాడాలని పేర్కొన్నారు. దేశంలోని అంబేడ్కర్కు సంబంధించిన స్థలాలు, ప్రాంతాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతిని ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలన్నారు. పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీ రాజ్యాంగం, తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని హామి ఇచ్చారని.. అది ఇంత వరకు అమలులోకాలేదని పొంగులేటి సుధాకర్ అన్నారు. సినీనటి, బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు. కేసీఆర్ కి ఏనాడు దళిత బిడ్డలపై ప్రేమ లేదని అన్నారు. బడుగు బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి లేదని, కేసీఆర్ చాలా హీనంగా మాడ్లాడుతున్నారని, తెరాస గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంట మంచిది అని విజయశాంతి పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబపాలన పోవాలని, అందరికి న్యాయం జరగాలని విజయశాంతి ఆకాంక్షించారు. కేసీఆర్, మంత్రులు ప్రజల్ని కుక్కలు అంటూ సంబోధిస్తున్నారని మండిపడ్డారు. తెరాస నేతల వార్నింగ్ లకు తాము భయపడేది లేదని, ఎంత దూరమైనా వెళ్తామని విజయశాంతి పేర్కొన్నారు. అరాచక ప్రభుత్వానికి ప్రజలే బుద్ధిచెప్తారని, తప్పుచేస్తే రాళ్లతో కొట్టమని కేసీఆర్ గతంలో చెప్పారని, కేసీఆర్కు త్వరలోనే ఆ పరిస్థితి వస్తుందని విజయశాంతి పేర్కొన్నారు.