Take a fresh look at your lifestyle.

గణనీయంగా తగ్గిన డెంగ్యూ కేసులు..

  • సీజనల్‌ ‌వ్యాధులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష
  • గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన
  • వెల్‌నెస్‌ ‌సెంటర్ల పనితీరుపై అసంతృప్తి
  • ఉద్యోగులు, జర్నలిస్టులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించడమే వాటి ఏర్పాటు ఉద్దేశ్యమన్న మంత్రి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ‌నమోదైన డెంగ్యూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, గత ఏడాది 7,988 కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాది ఇదే కాలంలో 5,263 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు వివరించారు. సీజనల్‌ ‌వ్యాధులపై ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసేందుకు మంగళవారం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు కీలక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి హరీష్‌ ‌రావు తన సమీక్షలో సీజనల్‌ ‌వ్యాధుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ఒకప్పుడు వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాపించేవని, అయితే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిషన్‌ ‌భగీరథ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం వల్లే కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిశుభ్రతను గణనీయంగా మెరుగుపరిచాయని, ఇది సీజనల్‌ ‌వ్యాధుల తగ్గింపుకు దారితీసిందన్నారు. ఏది ఏమైనప్పటికీ, ఆరోగ్య శాఖ నుండి వొచ్చిన తాజా గణాంకాలు గత వారం మరియు పది రోజులలో జ్వరాల కేసులలో స్వల్ప పెరుగుదలను వెల్లడిస్తున్నాయని, మారుతున్న వాతావరణ నమూనాల కారణంగా ఉండచ్చన్నారు. ఇకపై ఎలాంటి ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్‌ ‌రావు ఉద్ఘాటించారు. మలేరియా, డెంగ్యూ కేసులపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, పౌరులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. జ్వరం లక్షణాలు ఉన్న వ్యక్తులు సమీపంలోని ప్రభుత్వ దవాఖానలో  వైద్య సహాయం పొందాలని మరియు వారి వైద్యుల సూచనల మేరకు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్‌ ‌వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు పల్లె దవాఖానల నుంచి అన్ని దవాఖానల్లో సులభంగా అందుబాటులో ఉంటాయన్నారు.

డెంగ్యూ, మలేరియాకు ముందస్తు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడం ప్రాధాన్యతను గుర్తించిన మంత్రి హరీశ్‌రావు ఎన్‌ఎస్‌1 ‌కిట్‌లు, ఐజీఎం కిట్‌లు, మలేరియా ఆర్‌డీటీ కిట్‌లను అందుబాటులో ఉంచాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం, 1,099 ఎన్‌ఎస్‌1 ‌కిట్లు, 992 ఐజిఎం కిట్లు, 7,06,000 మలేరియా ఆర్‌డిటి కిట్లు స్టాక్‌లో ఉన్నాయని, ఎలాంటి కొరత లేకుండా చూడాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీని మంత్రి ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుంచి వొచ్చే రోగులకు స్వల్ప లక్షణాలున్నప్పటికీ వారిని అడ్మిట్‌ ‌చేసి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్‌ ‌రావు ఉద్ఘాటించారు. గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వైరల్‌ ‌ఫీవర్‌ ‌కేసులకు అవసరమైన పరీక్షలు నిర్వహించాలన్నారు. సంక్లిష్టమైన కేసులను గుర్తించి చికిత్స కోసం ప్రధాన దవాఖానలకు తరలించాలని, పరీక్ష ఫలితాలను వేగవంతం చేయడానికి, తెలంగాణ డయాగ్నోస్టిక్‌ ‌ద్వారా 24 గంటల్లో ఫలితాలను అందించాలని ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రస్తుతం జిల్లా స్థాయి వైద్య కళాశాలల్లో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, అత్యవసరమైనప్పుడు మాత్రమే కేసులను హైదరాబాద్‌కు రెఫర్‌ ‌చేయాలని అధికారులకు సూచించారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన మేరకు దవాఖానల్లో ప్రత్యేక ఫీవర్‌ ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధిగ్రస్తుల మరణాలను అరికట్టేందుకు వైద్యారోగ్య శాఖ కట్టుబడి ఉందని మంత్రి హరీష్‌ ‌రావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమల బెడద లేకుండా చూసేందుకు ప్రజలందరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్లతో పాటు పంచాయతీ, మున్సిపల్‌ ‌శాఖలు, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారం ఈ ప్రయత్నానికి కీలకమన్నారు హరీష్‌ ‌రావు. సీజనల్‌ ‌వ్యాధులు, ప్రభుత్వ దవాఖానల  సన్నద్ధతపై ప్రజలకు మీడియా ద్వారా అవగాహన కల్పించే బాధ్యతను జిల్లా వైద్యాధికారులకు అప్పగించారు. కేసుల సంఖ్య పెరిగితే వెంటనే ఉన్నతాధికారులకు నివేదించాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంటుందన్నారు. కొన్ని ప్రైవేటు దవాఖానలు డెంగ్యూ ట్రీట్‌మెంట్‌ ‌పేరుతో రోగులను దోపిడి చేయడం, విపరీతమైన ఫీజులు వసూలు చేయడం, అనవసర భయాందోళనలకు గురిచేస్తున్నాయని వైద్యారోగ్య శాఖ గుర్తించింది. ఇలాంటి కేసులను సమగ్రంగా విచారించి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్‌ ‌రావు జిల్లా వైద్యాధికారులను కోరారు.

ఇంకా వెల్‌ ‌నెస్‌ ‌సెంటర్ల పనితీరుపై మంత్రి హరీష్‌ ‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించడమే వెల్‌నెస్‌ ‌సెంటర్ల ఏర్పాటులో ప్రభుత్వ ఉద్దేశమని ఆయన నొక్కి చెప్పారు. సకాలంలో పరీక్ష ఫలితాలు, వైద్యులు షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలని మంత్రి ఆశిస్తున్నారని, అన్ని వెల్‌నెస్‌ ‌సెంటర్‌లను, వారు అందించే వైద్య సేవలను క్షుణ్ణంగా పరీక్షించాలని ఆరోగ్యశ్రీ సిఇఒను ఆదేశించారు. జూమ్‌ ‌ద్వారా నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీపీహెచ్‌ ‌శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్‌ ‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ ‌కుమార్‌, అన్ని జిల్లాల డీఎంహెచ్‌ఓలు, డీసీహెచ్‌లు, బోధనాదవాఖానలు, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్లు, పోగ్రాం అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply