- అవార్డులు తెచ్చేలా పని చేస్తున్నా బిల్లులు చెల్లించరా…?
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపాటు
జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : సర్పంచ్లు సొంత నిధులతో చేపట్టిన పనులతో ప్రభుత్వానికి అవార్డులు తెచ్చి పెడుతున్నా..వారికి మాత్రం బిల్లుల చెల్లింపు జరగడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అప్పులు చేసి మరీ గ్రామాలను అభివృద్ది చేస్తున్న సర్పంచులను అభినందించి, వారిని అక్కున చేర్చుకోకుండా వేధించడం తగదన్నారు. గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠ దామాలు, ఇతరత్రా పనులు చేసిన సర్పంచులకు బిల్లులు రాకపోవడంతో ఒక్కో సర్పంచ్ కనీసం రూ.
10 లక్షల అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. రైతు వేదికలు నిర్మించాలంటూ ప్రోత్సహించిన కలెక్టర్లు బిల్లులు ఎందుకు ఇప్పించలేక పోతున్నారని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులపై మంత్రి జిల్లా స్థాయి అధికారులతో సవి•క్ష సమావేశం నిర్వహించి పెండింగ్ బిల్లుల వివరాలు సేకరించి అక్టోబరు 31లోగా బిల్లులు చెల్లించేల చర్యలు చేపట్టాలని కోరారు. మిషన్భగీరథ నీరు గ్రామాల్లో ఎవరు తాగడం లేదని అందరూ డబ్బా నీరు కొనుగోలు చేసుకుని తాగుతున్నారని మిషన్ భగీరథతో కాంట్రాక్టర్లకు తప్ప ప్రజలకు ప్రయోజనం లేదని విమర్శించారు. మిషన్ భగీరథతో ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు.
మిషన్ భగీరథతో పైపుల కంపెనీలకు లాభం జరిగిందని దీంతో వేల కోట్ల నష్ట తప్ప ప్రయోజనం లేదని గ్రామాని ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లయితే ఖర్చు తక్కువతో పాటు ప్రజలకు ప్రయోజనం ఉండేదని వివరించారు. టీఆర్ఎస్ నాయకులు ప్రచార ఆర్భాటాలు మాని గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిని పరిశీలించాలని అన్నారు. మంత్రి కేటీఆర్ మనుగోడును దత్తత తీసుకుంటాను అనడం హాస్యాస్పదమని రాష్ట్రంలోని సమస్యలని పరిష్కరించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై ఉంటుందని మంత్రి కేటీఆర్ రాష్ట్ర మొత్తానికి మంత్రి అనే విషయాన్ని మరిచి పోవద్దన్నారు.