లోటస్పాండ్ నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం
పోలీసులు తీరుపై మండిపడ్డ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : గజ్వేల్ పర్యటనకు సిద్ధమైన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శుక్రవారం లోటస్ పాండ్లోని ఆమె ఇంటి వద్దకు భారీగా పోలీసులు తెల్లారేసరికి చేరుకున్నారు. ఎవర్నీ లోనికి పోనివ్వకుండా ఆంక్షలు పెట్టారు. లోపలి వారిని కూడా బయటకు వెళ్లనీయలేదు. ఆంక్షల విషయం తెలుసుకున్న షర్మిల..బయటకు వొచ్చి పోలీసులతో మాట్లాడారు. ఎందుకు హంగామా చేస్తున్నారని వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారికి హారతి ఇచ్చి లోపలికి స్వాగతం పలికారు. షర్మిల చర్యతో పోలీసులు కంగుతిన్నారు.
షర్మిల గజ్వేల్ వెళ్లేందుకు సిద్ధమవ్వడం రాజకీయంగా కలకలం రేపుతుంది. ఆమె పర్యటన అడ్డుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. షర్మిల గజ్వేల్లోని తీగల గ్రామానికి వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య వొస్తుందని పోలీసులు చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. అక్కడే ఉన్న పోలీసు అధికారి ఒకరు వి•రు వెళ్లకపోతే సమస్య రాదు కదా అని అనడంతో మరింత సీరియస్ అయ్యారు షర్మిల. అంటే రాజకీయ నాయకులు ఎక్కడికీ వెళ్లొద్దా అని ప్రశ్నించారు. వాళ్లను ఎంత మందిని హౌస్ అరెస్టు చేశారని నిలదీశారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలో షర్మిల పర్యటించే కార్యక్రమం ఉండింది.
అయితే గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. గజ్వేల్ వొస్తే అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ముందస్తుగానే షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో లోటస్పాండ్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిల నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దళితబంధు పథకం అర్హులకు అందడం లేదని తీగుల్ గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేసిన క్రమంలో షర్మిల సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు. ఉదయం ఉదయం 10 గంటలకు జగదేవ్ పూర్ మండలం, తీగుల్ గ్రామంలో పర్యటించాలని షర్మిల భావించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు గజ్వేల్లో పర్యటించేందుకు అనుమతిలేదంటూ షర్మిలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.