- రాష్ట్రంలో రియాల్టర్ల హత్యలు..ఆగడాలు
- కెసిఆర్ చుట్టూ బీహార్ అధికారులు…
- ఆ గ్యాంగు కారణంగానే రియల్ మోసాలు
- రాష్ట్రంలో హత్యలు, దాడులకు వీరే కారణం
- ఇబ్రహీంపట్నం కాల్పుల వెనక ధరణి లోపాలే కారణం
- మీడియా సమావేశంలో మండిపడ్డ పిసిసి చీఫ్ రేవంత్
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 2 : ధరణిలో లోపాలు, అసంబద్ధ నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో రియల్టర్ల హత్యలు, ఆగడాలు పెరిగాయని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల భూముల అక్రమాలు జరుగుతున్నాయన్నారు. 20 ఏళ్ళ కోసం ప్లాట్లు చేసి అమ్మితే వివరాలు ధరణిలో ఉండడం లేదన్నారు. 20 ఏళ్ళ తర్వతా కూడా ధరణిలో పాత యజమాని పేరు రావడంతోనే హత్యలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ తప్పుడు నిర్ణయాల వల్ల నిన్న హత్యలు జరిగాయి. పాత భూ యజమానులకు హక్కులు ఇవ్వడం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ నమూనా పోయింది. బీహార్ నమూనా వొచ్చేసిందన్నారు. కేసీఆర్ ప్రయత్నం తెలంగాణ ఉనికికి ప్రమాదం కానుందన్నారు. తెలంగాణ ప్రజలు మేల్కొవాలి.. అప్రమత్తం కావాలన్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబ మూలాలు బీహార్లో ఉన్నాయని, కల్వకుంట్ల కుటుంబం బీహార్ నుంచి వలస వొచ్చిందన్నారు. ఈ విషయాన్ని 2008లో కేసీఆర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారన్నారు. అయినా తెలంగాణ ప్రజలు కేసీఆర్కు 2 సార్లు అధికారం ఇచ్చారన్నారు.
ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో అభద్రతా భావం, అనుమానం మొదలైందని, కేసీఆర్ వ్యవహారం కూడా అనుమానాలను బలపరుస్తున్నాయని రేవంత్ అన్నారు. సీఎస్ సోమేష్కుమార్, డీజీపీ అంజనీకుమార్తో పాటు..రజత్కుమార్, అరవింద్ కుమార్, సందీప్కుమార్, సుల్తానియా బీహార్ వాళ్లేనన్నారు. ఇతర కీలక శాఖల్లో బీహార్ అధికారులకు సీఎం పెద్దపీట వేశారని ఆరోపించారు. ఇక్కడి ఐఏఎస్లకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారన్నారు. బీహార్కు చెందిన మంత్రి సంజయ్కుమార్ ఝూ తనపై దాడి చేస్తున్నారని, కేసీఆర్ను ఎలా ప్రశ్నిస్తావంటూ సంజయ్కుమార్ అంటున్నారని రేవంత్రెడ్డి తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో అభద్రతా భావం, అనుమానం మొదలైందని, కేసీఆర్ వ్యవహారం కూడా అనుమానాలను బలపరుస్తున్నాయని రేవంత్ అన్నారు. ధరణి పోర్టల్లో లోపాల కారణంగా భూ వివాదాలు వొస్తున్నాయని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నంలో కాల్పులకు కూడా ఇదే కారణమన్నారు.
ఇబ్రహీంపట్నం కాల్పుల్లో బీహార్కు చెందిన గ్యాంగ్ ఉందని, 20 ఏళ్ల క్రితం యజమానులుగా ఉన్నవారి పేర్లు ధరణి పోర్టల్లో వొస్తున్నాయన్నారు. ప్రస్తుత భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనివల్ల భూవివాదాలు వొచ్చి హత్యలకూ తెగబడుతున్నారని రేవంత్రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ను అడ్డంపెట్టుకుని నిజాం కాలంనాటి భూములు గోల్మాల్ అవుతున్నాయన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల భూములను కబ్జా చేస్తున్నారని, ఆర్డీవో కార్యాలయంలో భూముల రికార్డులు మాయం అయ్యాయన్నారు. బీహార్కు చెందిన అధికారులను అడ్డంపెట్టుకుని..తెలంగాణలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని, అందుకే బీహార్కు చెందిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే)ను సీఎం కేసీఆర్ తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ కూడా బీహారీ. సమాచారం ఇవ్వండి అంటే అయన కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్ని జైల్కి పంపిస్తా అంటున్న బండి సంజయ్కు ఇవన్నీ కనిపించడం లేదా అని అన్నారు. డీవోపీటీలో అధికారులపై విచారణ చర్యలు తీసుకుంటే వారంలో అధికారుల బండారం బయట పడుతుందన్నారు. బండి సంజయ్..కిషన్ రెడ్డి కేంద్రం మీద ఒత్తిడి చేయాలి. డీజీపీ మహేందర్ రెడ్డి మనసుకు గాయం అయ్యిందా..? మనిషికి గాయం అయ్యిందా..? మహేందర్ రెడ్డికి ఏమైంది అనేది హెల్త్ బులిటెన్ విడుదల చేయాలన్నారు. ఆయనకు గాయం అయినట్టు..వైద్యం చేయించుకున్నారు.. నేనే ఎక్కడా చూడలేదు. మహేందర్ రెడ్డి లీవ్లో వెళ్తే.. బీహారీ వాళ్ళే దొరికారా..తెలంగాణ ఐపీఎస్కు డీజీపీ అదనపు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వొచ్చు కదా అని రేవంత్ రెడ్డి అన్నారు.