- తెలంగాణ ప్రాజెక్టులపై బిజెపి నోరు మెదపాలి
- కాళేశ్వరంతో సాగులోకి కోటి ఎకరాలు
- మూడేళ్లలో నిర్మించి ఆదర్శంగా నిలిచాం
- తెలంగాణలో సాగు,తాగునీరు, కరెంట్లకు ప్రాధాన్యం
- వసలవెళ్లిన వారంతా తిరిగి ఊళ్లకు చేరుతున్నారు
- ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల అయిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తి చేసిన ఘనత సిఎం కెసిఆర్దని, ఇది దేశానికే ఆదర్శమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ ప్రాజెక్టువల్ల కోటి ఎకరాలు సాగులోకి వచ్చాయని చెప్పారు. రైతు బాగుపడితే దేశం కూడాబాగుపడుతుందని కెసిఆర్ ముందునుంచీ చెబుతున్నారని తెలిపారు. సాగునీటి లభ్యతతో గతంలో గ్రామాలను విడిచి వెళ్లినవారు తిరిగి వస్తున్నారని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగు, సాగు నీరు, రవాణా సౌక్యర్యం మెరుగవడంతోపాటు కోతలు లేని విద్యుత్ ఇస్తున్నామని.. దీంతో ఊర్లను విడిచి వెళ్లినవారు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారని తెలిపారు. శంషాబాద్లో జరిగిన పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా మారిందని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి సురభీ వాణీదేవిని తొలి ప్రాధాన్యతా ఓటుతో గెలిపించాలని కోరారు.
బీజేపీ వాళ్లు చాలా బాగా మాట్లాడుతున్నారని, ఐటీఐఆర్ తమవల్లే రాలేదని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. దీనిపై మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించారని, సీఎం కేసీఆర్ అనేకసార్లు ప్రధాని మోదీకి లేఖలు రాశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం హైదరాబాద్తోపాటు కర్ణాటకకు ఐటీఐఆర్ ప్రాజెక్టులను మంజూరు చేసింది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవ్వలేదని అనుకుందాం. మరి కర్ణాటకకు ఎందుకు ఇవ్వలేదు. రెండింటినీ ఎందుకు రద్దు చేశారు. ఆ ప్రాజెక్టులను యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి. ఆ క్రెడిట్ వారికి దక్కకూడదనే ఐటీఐఆర్ను రద్దు చేశారా అని ఆరోపించారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు.
బ్టడెట్లో ఎరువులపై రూ.2.50 లక్షల సబ్సిడీ ఎత్తివేసిందని, గ్యాస్ సబ్సిడీలో కోత విధించారని చెప్పారు. రాష్ట్రానికి బ్జడెట్లో కోతలు, ప్రజలకు వాతలే మిగిలాయని చెప్పారు. ఎన్నికలున్న కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో మెట్రో రైలు విస్తరణకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కర్ణాటకలోనూ మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపారు. గుజరాత్కు బుల్లెట్ట్రైన్ ఇచ్చారు. తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మనం కట్టే పన్నుల్లో 50 శాతం కూడా తిరిగి మనకు రావడం లేదని చెప్పారు. ప్రగతి సాధించే మన రాష్ట్రం కన్నా బీహార్ వంటి రాష్ట్రాలకు బ్జడెట్లో ఎక్కువ నిధులు ఇచ్చారని విమర్శించారు. మనకు మూడువేల కోట్లు డెవల్యూషన్ తగ్గించారని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ వంటివి ఇస్తామనిచెప్పి ఇవ్వలేదన్నారు.
’ఏడేండ్లలో బీజేపీ ప్రభుత్వం, స్థానిక బీజేపీ ఎమ్మెల్సీ ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క మంచి పని చెప్పమనండి. ఆరేండ్లలో 12 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇచ్చారా అని ప్రశ్నించారు. బీఎస్ఎన్ఎల్లో ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. వైజాగ్ స్టీల్ ఎ•-లాంటును అమ్మకానికి పెట్టారు. రాష్ట్రంలోని బీహెచ్ఈఎల్, బీడీఎల్ వంటి కంపెనీలను ప్రైవేటుపరం చేస్తారని’ విమర్శించారు. ఉద్యోగులంతా ఒకసారి ఆలోచించాలని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు లేకుండా చేస్తుందని ఆరోపించారు. ఐటీ అభివృద్ధిలో మనం బెంగళూరును దాటి తొలిస్థానంలో ఉన్నామని చెప్పారు.