ముమ్మరంగా వ్యాక్సినేషన్
రికార్డుస్థాయిలో ఉపాధి హామి
పేదల ఇళ్ల స్థలాల కార్యక్రమం త్వరగా ముగించాలి
గ్రామసచివాలయాలు, ఆర్బికెలు, విలేజ్ క్లినిక్ల నిర్మాణం పూర్తవ్వాలి
నాడు-నేడు కింద కలెక్టర్లతో సిఎం జగన్ సమిక్ష
కోవిడ్ నివారణపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఎల్లుండి తాను కూడా వ్యాక్సిన్ తీసుకుంటున్నానని తెలిపారు. కోవిడ్ సమస్యకు వ్యాక్సినేషనే పరిష్కారమన్నారు. వ్యాక్సినేషన్ను ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కేవలం 6 రోజుల పక్రియే మిలిగి ఉందని.. ఇది కూడా పూర్తయితే ఇక ఎన్నికలు ముగిసినట్టేనన్నారు. ఆ తర్వాత దృష్టి అంతా వ్యాక్సినేషన్ పైనేనని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ్న్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉపాధిహామి పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, 90 రోజుల్లో ఇంటిపట్టా, నాడు -నేడు, స్పందన, చేయూత, అర్బన్ ప్రాంతాల్లో మధ్యతరగతికి లాభాపేక్షలేకుండా సరసమైన ధరలకు ఇంటి స్థలాలు, కరోనా నివారణ తదితర అంశాలపై సీఎం సమిక్ష జరిపారు. ఏప్రిల్, మే నెలల్లో అమలు చేయనున్న స్కీంలు, కార్యక్రమాలపైనా సీఎం సమిక్ష నిర్వహించారు. ఉపాధిహామి పనులను రికార్డు స్థాయిలో చేపట్టారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. 25.50 కోట్ల పని దినాలను కల్పించారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.
కోవిడ్ సమయంలో కూలీలను ఆదుకున్నారు. దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాం. చిన్నరాష్ట్రమైనా మనం మూడో స్థానంలో ఉండడం గర్వకారణం. రూ. 5,818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగాం. ఏప్రిల్, మే, జూన్ నెలలో కొన్నిరోజుల వరకూ పనులు ముమ్మరంగా చేసుకునేందుకు అవకాశం ఉన్న సమయం ఇది. ఇదే వేగంతో ఉపాధిహామి పనులు ముమ్మరంగా జరగాలి. ఉపాధి హామి పథకాన్ని కలెక్టర్లు ఓన్ చేసుకోవాలి. ప్రతి 4-5 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా రివ్యూ చేయాలి.
జాయింట్ కలెక్టర్లు కూడా ఉపాధిహామి పథకంపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ అన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్కులు తదితరవాటి భవన నిర్మాణాలు వేగంగా జరగాలన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ భవనాల నిర్మాణంపై పూర్తి దృష్టిపెట్టాలని సూచించారు. గ్రామ సచివాలయాల నిర్మాణంలో నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల కలెక్టర్లు దృష్టిపెట్టాలని మిగతా జిల్లాలతో పోలిస్తే వెనకబడి ఉన్నాయన్నారు. బేస్మెంట్ లెవల్, గ్రౌండ్ ఫ్లోర్, శ్లాబ్ లెవల్ స్థాయిలో కృష్ణా, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలు పెండింగులో పనులు ఉన్నాయి. ఈ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మే నాటికల్లా గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలన్నారు.