116 దేశాలలో భారత్కు దిగువన కేవలం 15 దేశాలు
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: గురువారం విడుదలయిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్(ప్రపంచ ఆకలి సూచిక)లో ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాలలో భారతదేశం 101వ స్థానంలో ఉంది. తీవ్రంగా ఆకలిని గుర్తించిన 31 దేశాలలో భారతదేశం కూడా ఉంది. గత ఏడాది విడుదల చేసిన సూచికలో 107 దేశాలలో భారత్ 94వ స్థానంలో ఉండింది. ఈ సంవత్సరం భారత్ కంటే కేవలం 15 దేశాలు మాత్రమే దారుణంగా ఉన్నాయి. వీటిలో పాపువా న్యూ గినియా, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, కాంగో, మొజాంబిక్, సియెర్రా లియోన్, టిమోర్-లెస్టే, హైతీ, లైబీరియా, మడగాస్కర్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, చాడ్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, యెమెన్, సోమాలియా ఉన్నాయి. మన పొరుగు దేశాలు పాకిస్థాన్ 92వ స్థానంలో ఉండగా, నేపాల్ 76, బంగ్లాదేశ్ 76 వ స్థానంలో ఉండి భారత్ కన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. ప్రపంచ ఆకలి సూచిక ఆధారంగా ప్రస్తుత అంచనాలు ముఖ్యంగా 47 దేశాలు 2030 నాటికి ఆకలిని అధిగమించడంలో విఫలమవుతాయని చూపుతున్నాయి. జాతీయ, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో 2030 నాటికి ఆకలంటూ లేని అంటే జీరో హంగర్ దిశగా పురోగతిని కొలవడానికి ఉపయోగించే కీలక సూచికలు ఈ ఇండెక్స్ ఆధారంగా ఉంటాయి.
నాలుగు సూచికల విలువల ఆధారంగా- పోషకాహార లోపం, పిల్లల వృథా, పిల్లల స్టంటింగ్ మరియు పిల్లల మరణాలు- ఈ సూచిక 100 పాయింట్ల స్థాయిలో ఆకలిని నిర్ణయిస్తుంది. ఇక్కడ 0 సాధిస్తే ఉత్తమ స్థాయిగాను 100 ఉంటే అథమ స్థాయిలోను వర్గీకరించబడుతుంది. 2021 ర్యాంకింగ్ ప్రకారం సోమాలియా 50.8 పాయింట్లతో అత్యధిక స్థాయిలో ఆకలిని కలిగి ఉంది.ఇది అత్యంత ఆందోళనకరంగా పరిగణించబడుతుంది. అయితే 2000 సంవత్సరం నుండి ప్రపంచ వ్యాప్తంగా ఆకలి తగ్గుతుందని సూచిక చూపించినప్పటికీ పురోగతి మందగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా స్కోరు 4.7 పాయింట్లు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాల క్షీణత తరువాత ఆకలి ఇండెక్స్ను లెక్కించడానికి ఉపయోగించే నాలుగు సూచికలలో ఒకటైన పోషకాహార లోపం స్కోర్లు పెరుగుతున్నాయి. ఈ మార్పు ఇతర ఆకలి కొలతలలో రివర్సల్స్కు కారణం కావచ్చని నివేదిక పేర్కొంది.