ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ ,మే 13:పరిస్థితిలు మెరుగు అయ్యాకనే ఎన్నికలు అని ఈసీ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కొరోనా రెండో దశ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఖాలీ కానున్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పరిస్థితులు చక్కబడ్డాకే ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఖాలీ లపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈసీ కి లేఖ రాసింది.
ఈ లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం రివ్యూ చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని, సెక్షన్ 16 నిబంధనల ప్రకారం పదవి కాలం ముగియనున్న స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని సమావేశం తర్వాత ఈసీ అభిప్రాయ పడింది. అయితే, కొరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో లేవని సమీక్షా సమావేశంలో నిర్ణయించినట్టు ఈసీ తెలిపింది.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుండి కోవిడ్ వ్యాప్తి పై సంబంధిత అధికారులైన ఎన్డీఎంఏ/ ఎస్డీఎంఏ అధికారుల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత ఎన్నికల సంఘం ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించింది. తెలంగాణ లో ఆరు, ఏపి లో మూడు ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాల గడువు త్వరలో ముగియనుంది. తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీల పదవికాలం ఈ నెల 31 ముగియనుండగా, ఏపికి చెందిన ఎమ్మెల్సీ ల పదవి కాలం జూన్ 3 తో ముగియనుంది.