- అధికార లాంఛనాలు లేకుండా చేయడం దారుణం
- దళితులపై కెసిఆర్ ప్రేమ ఏమిటో గ్రహించాలి
- బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం
మహబూబ్నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోతే కనీసం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం సీఎం కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు దళితులు అంటే ఎంత ప్రేమో దీనిని చూస్తే తెలుస్తుందన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం చౌరస్తాలో ప్రజా గోస-బీజేపీ భరోసా కార్నర్ వి•టింగ్లో ఈటల మాట్లాడుతూ.. మొన్నటి వరకూ సీఎం కార్యాలయంలో గిరిజన, దళిత, బీసీ, మైనారిటీలు ఒక్కరు కూడా లేరన్నారు. ఏడేళ్ల కాలంలో ఒక్క దళితుడికి భూమి ఇవ్వలేదని విమర్శించారు. అసెంబ్లీలో తనను మాట్లాడనివ్వలేదన్నారు. ధరణి రాష్ట్రంలోని పేదల కొంపలు ముంచిందని తెలిపారు. పేదల బ్రతుకులు మారుతాయని అనుకుంటే.. చిన్నచిన్న భూములున్న పేద రైతులను బిచ్చగాళ్ళుగా మార్చారని అన్నారు. ధరణితో తన ఫ్యూడల్ భావజాలాన్ని సీఎం కేసీఆర్ బయట పెట్టుకున్నారని మండిపడ్డారు.
కోటి ఎకరాల మాగాణిలో ప్రతీ సంచిలో నాలుగు కిలోల ధాన్యం దండుకుంటున్నారని ఆరోపించారు. 2018 నుంచి మహిళా సంఘాలకు నాలుగువేలా ఐదు వందల బకాయిలు చెల్లించారా అని బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని చెబుతున్నారని.. కనీసం అన్ని జిల్లాల ఉద్యోగులకు నెల నాడు జీతాలు చెల్లించే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ(••్గ•జీనిణజీనిజీ) అమరులు కోరుకున్న తెలంగాణ లేదని అన్నారు. నిరుద్యోగ భృతి 3,116 అన్నారని.. అదీ అమలు కాలేదని దుయ్యబట్టారు. ఇలా రైతుల కళ్లల్లో.. మహిళల కళ్లల్లో.. నిరుద్యోగుల కళ్లల్లో మట్టి కొట్టారన్నారు. రుణమాఫీ ఒకేసారి సాధ్యం కాదని ఆనాడే చెప్పానని గుర్తుచేశారు.
దేశంలో బ్యాంకులకు ఎగగొట్టిన రైతులు మన రాష్ట్రంలోనే ఉన్నారని.. అది రుణమాఫీ కానందునే అని చెప్పుకొచ్చారు. బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి, పింఛన్లు, సంక్షేమ పతకాలకు 30 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని తెలిపారు. కానీ ఎక్సైజ్ నుంచి ప్రభుత్వం పిండుతున్న మొత్తం రూ.45 వేల కోట్లన్నారు. ఇలా పేదోడిని తాబోతులను చేస్తూ.. అటు కళ్యాణ లక్ష్మికి డబ్బులిచ్చి.. ఇటు తాళి బొట్టు తెంపుతున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఉద్యమంలో, అసెంబ్లీలో మాట్లాడిన మాటలను.. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనించాలన్నారు. బీఆర్ఎస్ను ఆ దేవుడు కూడా కాపాడలేడని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.