• మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ
• ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ఆమోదించే అవకాశం
న్యూదిల్లీ,సెప్టెంబర్1: జమిలి ఎన్నికలకు అడుగులు పడుతున్నాయి. ఒకే దేశం..ఒకే ఎన్నిక అంటూ ఎన్నో ఏళ్లుగా బీజేపీ ఈ నినాదం వినిపిస్తోంది. జమిలీ ఎన్నికల నిర్వహణపై కసరత్తులు చేస్తోంది. సాధ్యాసాధ్యాలపై చాలా చర్చలు జరిపిన తరవాత చివరకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ ప్యానెల్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 18నుంచి22 వరకూ ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిన కేంద్రం… జమిలి ఎన్నికలపై చర్చించేందుకు సిద్ధమవుతోంది. కోవింద్ నేతృత్వంలోని ఈ కమిటీలో రిటైర్డ్ జడ్జ్లు, మాజీ కేబినెట్ సెక్రటరీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో పాటు రిటైర్డ్ ఎలక్షన్ కమిషనర్, నిపుణులు ఉంటారు. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. దీంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్, యునిఫామ్ సివిల్ కోడ్ బిల్నీ ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. అయితే… అధికా రికంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటి వరకూ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతున్నాయి. సాధారణంగా రాష్ట్రాల్లో ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి.
ఒకవేళ ఈ ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్ పాస్ అయితే.. రాష్ట్రాలకు, లోక్సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ బిల్ పాస్ అవ్వాలంటే కచ్చితంగా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. లోక్సభ సభ్యుల్లో 67శాతం మంది, రాజ్యసభ సభ్యుల్లో 67 శాతం మందితో పాటు రాష్ట్రాల అసెంబ్లీలో 50శాతం మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విధానం ఆచరణ సాధ్యమేనా? దీనిని అమలు చేయడానికి తీసుకోవలసిన చర్యలేమిటి? వంటి అంశాలను అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశంలోని రాజకీయ పార్టీలతోనూ, రాష్టాల్రతోనూ విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతుంది.అయితే లోక్ సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, వెనుకగా 13 రాష్టాల్ర శాసన సభల ఎన్నికలు జరగవలసి ఉంటుంది. కేంద్రం తీరుతో ఈ రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం పడుతుంది. ’ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం చట్టాన్ని తీసుకురావాలంటే శాసన పరిశీలన సంఘం ద్వారా సిఫారసులను పొందవలసి ఉంటుంది.
కానీ దీని కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో అర్థమవుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేదని కొందరు చెప్తున్నారు. ఇప్పటికే దీనిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండ టంతో ఈ బిల్లు ఆమోదం పొందుతుందా అన్నది కూడా చూడాలి. లోక్ సభ ఎన్నికలు షెడ్యూలు ప్రకారం జరుగుతాయని అనుకుంటే, ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభల ఎన్నికలు లోక్ సభ ఎన్నికలతోపాటే జరగవలసి ఉంది. కానీ ఛత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్ శాసన సభల ఎన్నికలు లోక్ సభ ఎన్నికల కన్నా ఐదు నెలల ముందుగానే జరగవలసి ఉంది. మరోవైపు హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ శాసన సభల ఎన్నికలు లోక్ సభ ఎన్నికల అనంతరం 5 నుంచి 7 నెలల్లోగా జరగవలసి ఉంది. ఈ రాష్ట్రాలన్నిటితోనూ సంప్రదించి, లోక్ సభ ఎన్నికలతోపాటు శాసన సభల ఎన్నికల నిర్వహణకు ఒప్పించడం సాధ్యం కావచ్చు.
కానీ మిగిలిన 15 రాష్ట్రాల పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. వీటిలో కొన్ని రాష్ట్రాల శాసన సభల పదవీ కాలం ఒక ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఉంది. ఉదాహరణకు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరిగాయి. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాల్లో 2022లో ఎన్నికలు జరిగాయి. ఈ 15 రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలు లేవు. కొన్నిటిలో బీజేపీ, మరికొన్నిటిలో కాంగ్రెస్, ఇతర పార్టీలు, కూటములు అధికారంలో ఉన్నాయి. ఈ పార్టీలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి అధికారాన్ని ముందుగానే వదులుకోవడానికి ఇష్టపడే అవకాశం లేదు. ’ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. దీనికి సంబంధించిన బిల్లుకు పార్లమెంటులోని ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. అంతేకాకుండా దేశంలోని 50 శాతం రాష్టాల్రు దీనిని ఆమోదించాలి. కేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు భారీగా తగ్గుతుందని కేంద్రం చెబుతోంది. అంతే కాకుండా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందూకు వీలవుతుందని వివరిస్తోంది. ఇదే సమయంలో యునిఫామ్ సివిల్ కోడ్ బిల్నీ ప్రవేశపెట్టాలని భావిస్తోంది మోదీ సర్కార్.
ఎన్నికలకు ముందే ఈ హాని నెరవేర్చుకోవా లని గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే…దీనిపై ఇప్పటికే విపక్షాలు మండి పడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఙఅఅ బిల్పై స్పందించారు. కేంద్రం డ్రాప్ట్ బిల్ తీసుకొస్తోందని,ఈ బిల్పై పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు. అందులో ఎలాంటి నిబంధనలున్నాయో ఎవరికీ తెలియదని, ఏ వర్గం వాళ్లు ఈ కోడ్ వల్ల నష్టపోతారన్నది చూడాల్సి ఉందని అన్నారు. ఇక మహిళా రిజర్వేషన్ బిల్ 90వ దశకం నుంచి పెండింగ్లో ఉంది. పార్లమెంట్లో చాలా సందర్భాల్లో ఈ బిల్ ప్రవేశపెట్టినా…పాస్ అవ్వలేదు. అయితే…ఈ మధ్య మళ్లీ దీనిపై చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కవిత ఈ డిమాండ్తో ఢిల్లీలో ధర్నా కూడా చేపట్టారు.మొత్తంగా రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చే నివేదిక జమిలి ఎన్నికలకు కీలకం కానుంది.