- పార్టీకి భదాద్రి కొత్తగూడెం
- జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య రాజీనామా
- పెద్ద ఎత్తున పార్టీకి రాజీనామాలు
- చేస్తున్న సర్పంచ్లు, ఇతర నేతలు
కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 1 : రాహుల్ సభకు ముందే బిఆర్ఎస్కు షాక్ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున రాజీనామా బాట పట్టారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కనకయ్యతో పాటు ఆయన అనుచరులు, ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు నాయకులు బీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. మొత్తం 56 మంది సర్పంచ్లు, 26 మంది ఎంపీటీసీలు కారు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వీరంతా నేడు రాహుల్ గాంధీ హాజరుకానున్న ఖమ్మం బహిరంగ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట చాలామంది నేలతు కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తుంది. ఇంకా పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం సీనియర్ నేత, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావ్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మేకల మల్లిబాబు యాదవ్, రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ కాంగ్రెస్లో చేరనున్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పొంగులేటి వెంట వెళ్తారని ప్రచారం జరుగుతుంది. వీరందర్నీ ఇంకా బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు.
వారే పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కొన్ని నియోజకవర్గాలకు తన తరపున అభ్యర్థుల్ని కూడా ఖరారు చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లినా వారందరికీ టిక్కెట్లు ఇప్పిస్తానని హావి• ఇచ్చారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ చేరడంతో రెండు నియోజకవర్గాలు తప్ప..అన్ని నియోజకవర్గాల బాధ్యతలూ ఆయనకే ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో చేరికలు భారీగా ఉండటం రాజకీయవర్గాలు సహజ పరిణామంగా చెబుతున్నాయి.