- జనసంద్రం కానున్న మేడారం
- భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
- ట్రాఫిక్ చిక్కులు లేకుండా చర్యలు
- 7న అమ్మవారి దర్శనానికి సిఎం కెసిఆర్
నాలుగు రోజుల పాటు సాగే మేడారం మహాజాతర నిర్వహణకు అధికార యంత్రాగం భారీగా ఏర్పాట్లు చేసింది. ఎక్కడా లోటు లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. కోటిమందికిపైగా భక్తులు తరలివచ్చే ఈ జాతరను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించడంలో అధికారులు, పోలీస్ యంత్రాంగం నిమగ్నమయ్యింది. ఈ నెల 5న ప్రారంభం అయి 8న జాతర ముగియనువంది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ మేడారం ’సమ్మక్క-సారలమ్మ’ జాతరకు ఇప్పటికే అంకురార్పణ పడింది. మేడారంలో భక్తులు ఇప్పటికే కిక్కిరిసిపోయారు. ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరడంతో మహా జాతర మొదలవుతుంది. ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో ప్రధాన జాతర జరుగుతుంది. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ మేడారం నుంచే జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మేడారం మహాజాతరకు ఈ నెల 7న సీఎం కేసీఆర్ హాజరుకానున్నట్లు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ తెలిపారు. సమ్మక్క, సారలమ్మకు సీఎం మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. మహా జాతర పూర్తయ్యే వరకు మేడారంలోనే ఉంటామని వారు పేర్కొన్నారు.
ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడడం పెద్ద సవాలుగా ఉంటుంది. జాతర తేదీలకు సుమారు నెలరోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రధానంగా పోలీస్, ఆర్టీసీ, ఆరోగ్య.. తదితరశాఖ ఉద్యోగులు విధుల్లో నిమగ్నమయ్యారు. మేడారం జాతర నిర్వహణలో అత్యంత కీలకంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తున్నది. కోటిమందికిపైగా తరలివచ్చే జాతరలో ఎక్కడ కూడా చిన్నపాటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేపట్టింది. జాతర మార్గాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అన్ని రూట్లలో అవసరమైన చర్యలు తీసుకుంటోంది. డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతీ ఒక్కరు జాతర నిర్వహణలో నిమగ్నమై ఉన్నారు. పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. పర్యాటకులు, భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారంకు హెలికాప్టర్ సర్వీసులు కూడా పెట్టారు. దీంతో అన్ని దారులూ మేడారం వైపు కదులుతున్నాయి. వన దేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు గద్దెలను దర్శించుకున్నారు. జాతర టైంలో కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
శివసత్తుల పూనకాలతో జంపన్నవాగు మార్మోగుతోంది. మేడారం జాతర నాలుగు రోజులే అయినప్పటికీ రెండు, మూడు నెలల పాటు భక్తుల రాకపోకలు ఉంటాయి. రెండేండ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు ఈసారి నెలన్నర రోజుల ముందు నుంచే భక్తుల రాక మొదలైంది. వారం రోజులుగా ఆ సంఖ్య భారీగా పెరిగింది. జాతర కోసం ఇప్పటికే 30 వేల మందికి పైగా అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు.ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, వెంకటేశ్వర్లు, నోడల్ అధికారి వీపీ గౌతమ్, జేసీ స్వర్ణలత, డీఆర్వో రమాదేవి, ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చక్రధర్రావు తదితరులు పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఒక్క పోలీస్శాఖ తరఫున 12 వేలు, వైద్య ఆరోగ్య శాఖ నుంచి 2 వేలు, పంచాయతీరాజ్శాఖ శానిటేషన్ విభాగం నుంచి 4 వేల మందికి పైగా ఉద్యోగులు డ్యూటీ నిర్వహిస్తున్నారు. అన్నీ ప్రభుత్వ శాఖల నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లాలో పనిచేసే 80 శాతం మందికి పైగా ఉద్యోగులు మేడారంలోనే డ్యూటీ చేస్తున్నారు. మేడారం పరిసర ప్రాంతాలలో ఏ చిన్న సంఘటన జరిగినా తెలియడానికి, ట్రాఫిక్ జాం విషయాలు తెలుసుకోవడానికి 400 సీసీ కెమెరాలను అమర్చారు.
కేవలం సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దనే 30కి పైగా కెమెరాలను బిగించారు. వీటిని ఐటీడీఏ గెస్ట్హౌజ్లోని రెవెన్యూ శాఖ, గద్దెల సపంలో ఏర్పాటుచేసిన పోలీస్శాఖ కంట్రోల్ రూంలకు అనుసంధానం చేశారు. ఈ రెండు చోట్ల భారీ స్క్రీన్లను ఏర్పాటుచేసి ప్రతి క్షణం ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్య సౌకర్యం అందించడానికి ప్రభుత్వం తరపున 16 చోట్ల ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటుచేశారు. టీటీడీ కల్యాణ మండపంలో తాత్కాలికంగా 50 పడకల హాస్పిటల్ను అందుబాటులోకి తెచ్చారు. అమ్మవార్ల సన్నిధిలో కాన్పు కోరుకునే గర్భిణుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేశారు. డాక్టర్లు, ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బంది కలిపి రెండు వేల మందికిపైగా ఇక్కడ డ్యూటీ చేయనున్నారు.