పత్రికారచయితగా వివిధ దినపత్రికలలో వివిధ హోదాల్లో కలం రaళిపించిన ‘కల్లూరి భాస్కరం’ మనిషి మౌనముని. రచనల్లో మలయమారుతాలు వీస్తాయి, జ్వాలలు రగులుతాయి. పుస్తకం ఆయన ప్రాణం. అధ్యయనం ఆయన దైనందిన క్రియ.. రచన ఆయన శ్వాశ. ఆద్భుతమైన అనువాద ప్రక్రియలో ఆయనది అందెవేసిన చెయ్యి. ఇప్పటికే అనేక పుస్తకాలు పాఠకులను అలరించాయి. రచనల తీవ్రతను బట్టి ‘కల్లూరి భాస్కరం’ గారిని ‘‘కలం భాస్వరం’’ అని కూడా పిలుస్తుంటారు. ఆయన కలం నుంచీ ధారావాహికంగా వెలువడిన గ్రంథమే నేడు ఆవిష్కరిస్తున్న పుస్తకం, ‘‘ఇవీ మన మూలాలు’’.
పుస్తక అధ్యయనానికి, రచనకు ఆయన ఎంచుకున్న అంశం సాధారణమైనది కాదు. అందరికీ మామూలుగా తలకెక్కదు. ఈ పుస్తకంలో విషయం సామాన్యమైనది కాదు. మానవాళి మూలాలకు, అలోచనల లోతుకు వెళ్ళాలి.శ్రమించాలి. అర్ధంచేసుకోవాలి. వైజ్ఞానిక విషయాలకు కామాలే తప్ప ఫుల్ స్టాప్లు ఉండవన్న సంగతి తెలిసిందే. పుస్తకాంశం జెనెటిక్స్ సంబంధమైనది. మానవ పరిణామం, వలసలు, భషలు, మతాలు, సంస్కృతులు, వ్మాయాలు ప్రపంచంలో వివిధ జనాభాల మూలాలు, పురాచరిత్ర, చరిత్రలతో ముడిపడిన మేరకు పాపులేషన్ జెనెటిక్స్ మొదటినుంచీ తనలో ఆసక్తిని రేపుతున్న అంశమని అభిప్రాయమని వివరించారు. 2000 సంవత్సరం తరువాత అనేక విషయాలతో జతకూడిన జన్యుపరిశోధన మలుపులు తిరిగిన ఆవిష్కారాలను, వలసలతో సహా వివాదాలు చూపిన, చూపుతున్న పరిష్కారాలను, వాద ప్రతివాదాలను గమనిస్తూ అప్పటివరకూ జరిగిన జన్యు నిర్థారణలను వెలుగులోకి తెస్తూ టోనీ జోసెఫ్ 2018లో ఎర్లీ ఇండియన్స్ పుస్తకం వెలువరించారట.
అయితే అంతకు కొన్నేళ్ళ మునుపే ద హిందూ పత్రికలో రాసిన అనేక వ్యాసాలను చదివి అవగాహన మేరకు మన సందర్భాలకు అన్వయించుకోవడం మొదలైందంటారు. జెనెటిక్స్ రంగంలోని పది మంది ముఖ్యులలో ఒకడిగా 2015లో ‘నేచర్’మ్యాగజైన్ గుర్తించిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో జెనెటిక్స్ విభాగంలో ప్రొఫెసర్ డేవిడ్ రైక్ గతాన్ని తెలుసుకోవడానికి సాయపడే ప్రాచీన మానవ జెనెటిక్స్ రంగంలోని పదిమంది ముఖ్యులలో ఒకడిగా ప్రపంచానికి పరిచయం చేసిన పుస్తకం ఆసాంతం చదివి, ఆకళింపు చేసుకుని పునః సృష్టించారు రచయిత. ఆ అంశం అర్ధం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు..
జన్యు చరిత్రను వ్యవసాయ విప్లవం తిరిగి రాసిందంటూఎంతమంది గమనించారో తెలియదు కానీ, మహా భారతం ప్రారంభంలొనే వ్యవసాయం ప్రస్తావన వస్తుందట. జనభా పెరుగుతుండడంతో తను ఆభారాన్ని మోయలేకపోతున్నానని, దీనినుంచీ తనకు విముక్తి ప్రసాదించమనిభూదేవి బ్రహ్మదగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటే, సకాలంలో వర్షాలు పడి పంటలు బాగ పండుతున్నాయని, పుష్టికరమైన ఆహారం పుష్కలంగా లభిస్తుందని, దానితో జనాభా పెరిగిందనీ, రాబోయే రోజుల్లో దేవాసుర అంశతో పాండవ కౌరవులు జన్మించి యుద్ధం చేసి భారీ సంఖ్యలోజన నష్టానికి కారణమౌతారనీ, అప్పుడు నీ భారం తగ్గుతుంది అప్పటివరకూ ఓపిక పట్టమని బ్రహ్మ భూదేవికి చెబుతాడట. ఆధునిక కాలానికి వస్తే థామస్ రాబర్ట్ మాల్తస్ అనే ఆర్థిక శాస్త్రవేత్తకూడా జనాభా పెరగడానికి ఆహార లభ్యతకు ఉన్న సంబంధాన్ని చర్చించాడట. అందుకే మాల్తూసియన్ సిద్ధాంతంగా అది ప్రాచుర్యం పొందిందంటారు రచయిత.
పునరుక్తి దోషం అంటినా సరే కొన్నొ జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోక తప్పదంటూ భరత్ – చైనా వరి సాంకర్యం అధ్యాయంలో వ్యవసాయ విస్తరణను ప్రస్తావిస్తూ కొంతవరకూ పశుపాలన విస్తరన కూడా అలాంటిదే అంటారు. ప్రచీన కాలంలోనే వ్యవసాయం ప్రపంచ వ్యాప్తంగా ఒక విప్లవ రూపం ధరించి ఉపాధికి సంబంధించిన ఉత్పత్తి రూపంగానే ఉండక కొన్ని మత భావనలను, తంతులను, దేవీ దేవతా రూపాలను ముందుకు తెచ్చి, ఒక సంస్కృతి నిర్మించిందట. అవి ప్రపంచ వ్యాప్తం కావడంతో భారతీయులమైన మన అనుభవం కూడా అందులో భాగమే కానీ భిన్నమైనది కాదట. వ్యవసాయ జనాల వలసతో యూరప్ లోనూ, ఇతరచోట్ల జరిగినట్టే ఆగ్నేయాసియాలోనూ జరిగిందని, చైనా నుంచీ అక్కడికి వ్యవసాయం తీసుకెళ్ళిన అస్ట్రో ఏషియాటిక్, ఆస్ట్రో నేసియన్ భాషీయులు, స్థానికులైన వేట- ఆహార సేకరణ జనానికి స్థానభ్రంశం కలిగించారట.
ఇలా, ఆసాంతం పుస్తకంలో నాలుగు భాగాలతో 53 వ్యాసాలుగా క్రోడీకరించారు. అద్భుతాలను ఆవిష్కరించిన నూతన జన్యు విజ్ఞనం మానవ సంబంధమైన జన్యుశాస్త్ర విషయాలకన్నా మానవ వలసల చరిత్రను వెలుగులోకి తేవడంలో జన్యువిప్లవం గొప్ప విజయం సాధించిదట. అటువంటి క్లిష్టమైన విషయాన్ని డేవిడ్ రైక్ రాసిన ‘‘హు వియ్ ఆర్ అండ్ హౌ వియ్ గాట్ హియర్’’ అనే పుస్తకం రెండోసారి అధ్యయనం చేసి, ఆకళింపుజేసుకుని ముఖ్యమనుకున్న భాగాలను తెలుగులో నోట్స్ రాసుకోవడం మొదలు పెట్టి, భాస్కరంగారు ఫేస్బుక్ మాధ్యమంలో ధారావాహికంగా తెలుగులో అందించారు.
అలా రాసుకుంటున్నకొద్దీ…
లిలిచూపితివట నీ నోటను, బాపురే పదునాల్గు భువనభాండమ్ముల నా
రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాంచెన్!
లిలిలోకంబులు లోకేశులు, లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వండే కాకృతి వెలుగు నతని నే సేవింతున్!
అనే పద్యాలు మాటి మాటికీ గుర్తుకు రాసాగాయట. అలాగని ఆ పుస్తకం ద్వారా తాను పొందిన అనుభూతికీ, ఈ పద్యాలు చెప్పే భావానికీ పూర్తి సామ్యం కుదిరందని చెప్పలేనుబీ కానీ అవి మాత్రం గుర్తుకొస్తూనే ఉన్నాయంటారు కల్లూరి భాస్కరం. వీరి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, కొవ్వూరుకు దగ్గరలోని ప్రక్కిలంక. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు.
భాస్కరంగారి గారి గురించి ప్రముఖ సాహితీవేత్త వాడ్రేవు చినవీరభద్రుడు పరిచయ వాక్యాలు రాస్తూ గతంలో అయన రచనలు కాలికస్పృహ, కొన్ని సాహిత్య వ్యాసాలు, ఇన్ సైడర్, రాజ్ మోహన్ గాంధి, కౌంటర్ వ్యూ, వయిపడగలు నేడు చదివితే, మంత్రకవాటం తెరిస్తె మహాభారతం.. రచలన్నీ ఒక ఎత్తుకాగా ‘‘ఇవీ మన మూలాలు’’ ఒక మల్టిపుల్ డిసిప్లినరి అధ్యయనమని, ఈ కృషి ఒక్క మనిషి, ఒంటి చేత్తో చేయగలిగేది కాదని, ఒక విశ్వ విద్యాలయం లేదా ఒక శాస్త్రవేత్తల బృందానికే సాధ్యమని, రోజులో నిర్విరామంగా 13 గంటలు చేస్తే తప్ప క్రోడీకరించ సాధ్యం కాని విజ్ఞానమీవిషయమని ప్రశంసించారు.,
-నందిరాజు రాధాకృష్ణ
98481 28215
(సోమాజిగూడా ప్రెస్క్లబ్లో ఆదివారం జనవరి 28
సాయంత్రం పుస్తకావిష్కరణ సందర్భంగా..)