- డ్రైవర్ నిరల్క్ష్యంతో బస్సు కిందపడి బాలిక మృతి
- కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
- మరో ఘటనలో జనగామలో డ్రైవర్ నిర్లక్ష్యానికి మహిళ మృత్యువాత
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : రెప్పపాటులో జరిగిన ప్రయాదం ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తీరని కడుపుకోత మిగిల్చింది. ఎప్పటిలాగే హుషారుగా స్కూల్కు బయలుదేరిన ఆ చిన్నారికి ఇదే ఆఖరి రోజు అవుతుందని ఊహించలేదు. ఆడుతూపాడుతూ స్కూల్కు వెళ్లిన తమ చిన్నారి ఇక లేదని తెలిసిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. స్కూలు బస్సు స్కూటర్ని ఢీకొట్టడంతో ఆ బండిపై ఉన్న చిన్నారి కిందపడిపోయి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రెడ్డిల్యాబ్స్ కంపెనీ వద్ద కిషోర్ అనే వ్యక్తి తన కూతురు దీక్షిత(8)ను స్కూల్లో వదిలి పెట్టేందుకు స్కూటీపై వెళుతూ రోడ్డు దాటుతుండగా భాష్యం స్కూల్ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో దీక్షిత బైక్పై నుంచి ఎగిరి బస్సు వెనక చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. పాప బోరంపేటలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతుందని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ రహీమ్ అతివేగంగా నడిపాడని.. అతని నిర్లక్ష్యమే పాప మృతికి కారణమని బాచుపల్లి సీఐ సుమన్ వెల్లడించారు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ చిన్నారి ఇక లేదని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో ఘటనలో జనగామ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం, నిద్రమత్తు ఓ ప్రాణాన్ని బలితీసుకోగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ కుటుంబం భదాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో లింగాల ఘనపురం మండలం కుందారం కెనాల్ వద్ద వారు ప్రయాణిస్తున్న అర్టీగా వాహనం చెట్టును బలంగా ఢీకొనడంతో నుజ్జునుజ్జయింది. మృతురాలిని సింధూజగా గుర్తించారు. ఈ ప్రమాదంలో సింధూజ అనే మహిళ మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఏరియా దవాఖానకు తరలించారు. కాగా, అతివేగం, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.