నాగపూర్, ఫిబ్రవరి 10 : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నాగ్ పూర్ టెస్టులో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ…అరుదైన ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్గా రోహిత్ రికార్డులకెక్కాడు. మాజీ కెప్టెన్లు కోహ్లీ, ధోనిలకు సాధ్యం కానీ రికార్డును రోహిత్ శర్మ అందుకున్నాడు. ధోని, కోహ్లీ కెప్టెన్లుగా వన్డేలు, టెస్టుల్లో సెంచరీ చేశారు కానీ..టీ20ల్లో కొట్టలేదు. ప్రపంచ వ్యాప్తంగా కెప్టెన్ గా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ప్లేయర్ల జాబితాలో రోహత్ శర్మ నాల్గో స్థానంలో ఉన్నాడు. రోహిత్ కంటే ముందు దిల్షాన్ (శ్రీలంక), డు ప్లెసిస్ (సౌతాణాఫ్రికా), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) కెప్టెన్ గా మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించారు.
ఆస్టేల్రియాతో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ శర్మ 171 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ చేశాడు. ఇక టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది తొమ్మిదో సెంచరీ కావడం విశేషం. ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన చివరి వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ..తాజాగా తొలి టెస్టులోనూ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ…సహచరులు ఔటవుతున్నా..ఆస్టేల్రియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పుజారా(7), కోహ్లి (12), సూర్య (8) విఫలమైనా రోహిత్ శర్మ మాత్రం అద్భుతంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.