గ్యారెంటీ లేని డిక్లరేషన్లను ప్రజలు నమ్మరు
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 : తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు, కల్లి బొల్లి మాటలను నమ్మే స్థితిలో లేరని కడ్తాల్ జెడ్పిటిసి దశరథ్ నాయక్ అన్నారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో స్థానిక నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీల మోసపూరిత హామీలపై ధ్వజమెత్తారు. 60 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని, తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదల, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ భారాసా ప్రభుత్వమని అన్నారు. తెలంగాణలో ప్రజలు ఇక కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని తెలిసి లేనిపోని హామీలు, ఉచిత గ్యారెంటీలతో దొంగ మాటలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి నాలుగు సంవత్సరాల క్రితం నియోజకవర్గం మరియు ప్రజలను వదిలి ముందున్న ఓట్ల పండుగకు మళ్లీ తిరిగి రావడం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రకటిస్తున్న ఉచిత హామీలు, గ్యారెంటీ వరాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలులో లేవని ధ్వజమెత్తారు. కల్లబొల్లి మాటలు, అమలు కాని హామీలతో ప్రజలను మాయ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు, ఉద్యమ నాయకులు సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 2024లో తెలంగాణ గడ్డపై కేసీఆర్ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కల్వకుర్తి గడ్డపై జైపాల్ యాదవ్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ & ఆమనగల్, కడ్తాల్ మండలాల పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, సర్పంచులు లక్ష్మీ నరసింహారెడ్డి, కృష్ణయ్య, భారతమ్మ నరసింహ, సులోచన సాయిలు, ఎంపీటీసీ లచ్చిరాం నాయక్, మంజుల చంద్రమౌళి, డైరెక్టర్ నరసింహ, వెంకటేష్, ఉప సర్పంచ్ వినోద్, జలీల్, నాయకులు సాబేర్, శ్రీను, రమేష్, సురేష్, నాగార్జున, నాయకులు తదితరులు పాల్గొన్నారు.