Take a fresh look at your lifestyle.

యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్‌

  • ప్రణాళికను రూపొందిస్తున్న రైల్వే అధికారులు
  • యాదాద్రి వరకూ రెండవ లైన్‌ ‌పొడిగింపు
  • రెండవ లైన్‌ ‌పనులను సమీక్షించిన అధికారుల బృందం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్‌ ‌న్యూస్‌. ‌ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వరకు ఎంఎంటీఎస్‌ ‌ట్రైన్‌ ‌సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎంఎంటీఎస్‌ ‌సేవలకు సంబంధించి రైల్వే అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. దీంతో యాదాద్రికి ఎంఎంటీఎస్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సీఎం కేసీఆర్‌ ‌వెయ్యి కోట్ల రూపాయలతో ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆలయం ప్రారంభమైన తర్వాత యాదగిరిగుట్టకు భక్తుల తాకిడి ఎక్కువైంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సాధారణ రోజుల్లో 30 వేలకు పైగా శని, ఆదివారం, సెలవు దినాల్లో 50 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. హైదరాబాద్‌ ‌పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాదగిరిగుట్టకు వస్తున్నారు. అయితే యాదగిరి గుట్టకు ట్రైన్‌ ‌సౌకర్యం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

చాలామంది భక్తులు ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ, సొంత వాహనాల్లోనూ వస్తున్నారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే తక్కువ ఖర్చుతో ప్రయాణ వసతులు కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్‌ ‌రెండోదశ పొడిగింపే సరైందని భావించింది. అయితే 2016లోనే ప్రణాళికలు సిద్ధం చేసినా అది పట్టాలెక్కలేదు.  తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వంద శాతం కేంద్ర ప్రభుత్వం నిధులతో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ ‌ట్రైన్‌ ‌ను పొడిగిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ ‌నుంచి ఘట్‌కేసర్‌ ‌వరకూ ఎంఎంటీఎస్‌ ‌రెండో దశ కింద 21 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మిస్తున్నారు. అయితే ఘట్‌కేసర్‌ ‌నుంచి యాదాద్రి (రాయగిరి) వరకూ మరో 33 కి.మీ. రెండో దశను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకు 330 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల సమకూర్చే విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో పొడిగింపు నిలిచిపోయింది. పెరిగిన ధరల దృష్ట్యా ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు రూ.430 కోట్లకు చేరింది.

రైల్వేశాఖ వంద శాతం నిధులతో రెండో దశ ఎంఎంటీఎస్‌ ‌లైన్‌ ‌పొడగింపును రైల్‌ ‌వికాస్‌నిగమ్‌ ‌లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ల క్రితమే రాయగిరి రైల్వే స్టేషన్‌ ‌పేరును యాదాద్రి రైల్వే స్టేషన్‌ ‌గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. రెండో దశ ఎంఎంటీఎస్‌ ‌పొడిగింపు పనులను చేపట్టేందుకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ ‌కుమార్‌ ‌జైన్‌, ‌సీజీఎం ఆర్‌వీఎన్‌ఎల్‌ ‌మున్నా కుమార్‌, ‌సికింద్రాబాద్‌ ‌డీఆర్‌ఎం ఏకే గుప్తాల నేతృత్వంలోని అధికారుల బృందం యాదాద్రి రైల్వే స్టేషన్‌ను సందర్శించింది. రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు కల్పించే సదుపాయాలు, స్టేషన్‌ అభివృద్ధికి ప్రణాళికలు, కొత్తగా చేపట్టే ఎంఎంటీఎస్‌ ‌రెండవ లైన్‌ ‌పనులను అధికారుల బృందం సమీక్షించింది.

యాదాద్రి ఆలయ మోడల్‌ ‌తో రైల్వేస్టేషన్‌ ‌ముఖ ద్వారం ఎంఎంటీఎస్‌ ‌రెండవ దశ ప్రాజెక్ట్‌లో భాగంగా ఘట్‌కేసర్‌, ‌బీబీనగర్‌, ‌భువనగిరి, యాదాద్రి స్టేషన్లలో అదనపు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రస్తుతమున్న యాదాద్రి రైల్వేస్టేషన్‌లో నూతనంగా ప్లాట్‌ఫాం, స్టేషన్‌ ఇతర వసతులను కల్పించనున్నారు. ఇందుకోసం అవసరమైన అనువైన స్థలాన్ని అధికార బృందం పరిశీలించింది. యాదాద్రి క్షేత్ర ఆలయ మోడల్‌ ‌ను రైల్వేస్టేషన్‌ ‌ముఖ ద్వారంగా నిర్మించాలని అధికారుల బృందం నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఎంఎంటీఎస్‌ ‌రెండో దశ పొడిగింపు పనులు చేపట్టేందుకు కేంద్రం ముందుకు రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎంటీఎస్‌ ‌రెండో దశ పొడిగింపుతో స్వామివారి దర్శనానికి డబ్బు, సమయం ఆదా అవుతుందని భక్తులు చెబుతున్నారు. యాదాద్రి రైల్వే స్టేషన్‌ ‌లో అన్ని ఎక్స్‌ప్రెస్‌ ‌రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కానీ ఎంఎంటీఎస్‌ ‌రెండో దశ పొడిగింపు ఎప్పటికీ పూర్తవుతుందో లేదా కాగితాలకే పరిమితం అవుతుందో అనేది వేచి చూడాల్సి వొస్తుంది.

Leave a Reply