- దెబ్బ తిన్న 115 పిఆర్ రోడ్లు, 61 ఆర్ అండ్ బి రోడ్లు
- భద్రాచలం జిల్లాలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం
భద్రాచలం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 03 : ఎడతెరిపి లేని భారీ వర్షాలు, గోదావరి వరదలతో జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. గురువారం ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జాతీయ విపత్తులు, హెమ్ మంత్రిత్వ శాఖ సలహాదారు కునాల్ సత్యార్థి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డిప్యూటీ సెక్రటరీ అనిల్ గైరోల, సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ రమేష్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ పవర్ డిప్యూటి డైరెక్టర్ భయా పాండే. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సీనియర్ సైంటిస్ట్ శ్రీనివాసులు, ఆయిల్ సీడ్స్ డైరెక్టర్ డా పొన్నుస్వామి, ఐఈఎస్ రీజినల్ అధికారి ఎస్కే కుష్వా అధికారుల బృందం బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో పర్యటించారు. బుధవారం రాత్రి ఐటిసికి చేరుకున్న అధికారులు గురువారం ఉదయం వర్షాలు, వరదలు జరిగిన నష్టాలపై ఐటిడిఏ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లు, రహదారులు, పంటలు, లింకు రోడ్లు, పశుసంపద, మిషన్ బగీరథ పథకాలు, ఇరిగేషన్ చెక్ డ్యాంలను వివరించారు.
అనంతరం బూర్గంపాడు మండలం, గ్రామంలో పుత్తేరువాగు, కొల్లు చెరువులు, గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి అయ్యారు. అనంతరం బూర్గంపాడు నుండి కుక్కునూరు వెళ్లే రహదారిలో కోతకు గురైన రహదారిని పరిశీలించారు. అక్కడి నుండి అశ్వాపురం మండలం ఆనందాపురంలో పర్యటించి దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక గత నెలలో కురిసిన భారీ వర్షాలు వల్ల అధిక వర్షపాతం నమోదైనట్లు వివరించారు. భారీ వర్షాలు, గోదావరికి ఎగువ నదుల నుండి వొచ్చిన వరదల కారణంగా గత నెల 20వ తేదీన భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వరద వొచ్చినట్లు తెలిపారు. తదుపరి 26వ తేదీ నుండి 28వ తేదీ మూడవ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహించినట్లు చెప్పారు. వర్షాలు, గోదావరి వరదల వల్ల జిల్లాలోని 11 మండలాల పరిధిలోని 84 గ్రామాలు ముంపుకు గురైనట్లు తెలిపారు. ముంపుకు గురైన గ్రామాల ప్రజలను 44 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. ముంపుకు గురైన 4454 కుటుంబాలకు చెందిన 14081 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మూడు ఎన్టీఆర్ఎఫ్ టీములు, ఒక హెలికాప్టర్ అత్యవసర సేవలకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
115 మంది గజ ఈతగాళ్లును, 85 నాటు పడవులు, 5 వేల లీటర్లు డీజిల్, 2 వేల లీటర్ల పెట్రోల్ అత్యవసర సేవలకు అందుబాటులో ఉంచామని చెప్పారు. చెరువులు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండి అలుగులు పారుతుండటంతో ప్రమాదం వాటిల్లితే తక్షణమే రక్షణ చర్యలు చేపట్టేందుక 15 వేల ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచామని చెప్పారు. రహదారులపైకి నీరు చేరిన ప్రాంతాల్లో ప్రజలు రవాణా చేయడం వల్ల ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున రవాణా సేవలు నిలిపి వేసేందుకు బారికేడింగ్ ఏర్పాటుకు 70 ట్రాక్టర్లు, 16 లారీలు, 6 క్రేన్లును అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రానున్న మూడు నెలలకు సరిపోను నిత్యావసర వస్తువులు స్టాకు ఉంచినట్లు చెప్పారు. 170 లైఫ్ జాకెట్లు, 118 లైఫ్ బాయిస్ అందుబాటులో ఉంచామని చెప్పారు. వరదల సహాయక చర్యలకు 23 మంది మండల ప్రత్యేక అధికారులు, 184 మంది గ్రామస్థాయి ప్రత్యేక అధికారులు, 548 మంది గ్రామ పంచాయతీ స్థాయి అధికారులు,7 మంది సెక్టోరియల్ అధికారులు, 42 మంది జోనల్ అధికారులు, 11 మంది మొబైల్ టీములను నియమించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. 103 ఆవాసాల్లో 11 చోట్ల మిషన్ బగీరథ ద్వారా మంచినీటి సరఫరాకు మరమ్మత్తులు వాటిల్లినట్లు చెప్పారు.
6 మండలాల పరిధిలోని 9 గ్రామాల్లో 15 పశువులు, 19 మేకలు, 3030 కోళ్లు చనిపోయినట్లు చెప్పారు. 41 గృహాలు పూర్తిగాను, 162 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. 16 మండలాల పరిధిలోని 44 గ్రామాలకు చెందిన 1402 మంది రైతులకు 3151 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 115 రోడ్లు మరమ్మత్తులకు గురైనట్లు చెప్పారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించి 47 చోట్ల మరమ్మత్తులకు గురైనట్లు తెలిపారు. ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని 61 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నట్లు చెప్పారు. అనంతరం అశ్వాపురం మండల పరిధిలోని ఆనందాపురం గ్రామంలో వరద ముంపు వల్ల దెబ్బతిన్న పత్తి పంటను అదికారుల బృందం పరిశీలించింది. రైతులతో ముఖాముఖి అయిన అధికారుల బృందం వరదలు సంభవించినా ముంపు వాటిల్లని పంటలు సాగు చేపట్టే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వర్షాలు, గోదావరి వరదలు వల్ల దెబ్బతిన్న పంటలు, రహదారులు క్షేత్రస్థాయిలో పరిశీలించామని, జరిగిన నష్టాలపై సమగ్ర నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి అందచేయనున్నట్లు అధికారుల బృందం తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎస్పీ డాక్టర్ వినీత్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లా, పంచాయతీరాజ్ ఈఈ మంగ్యా, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, పశు సంవర్థక శాఖ డిడి పురందర్, మిషన్ బగీరథ ఈఈలు తిరుమలేష్, నళిని తదితరులు పాల్గొన్నారు.