- హోంమత్రిపై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు
- ఆ వెంటనే రాజీనామా చేసిన అనిల్ దేశ్ ముఖ్ – తదుపరి హోంమంత్రిగా దిలీప్ వాల్సే ?
మహారాష్ట్రలోని మహా అగాఢి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా చేశారు. ముంబై మాజీ కవి•షనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణల కేసులో.. హోంమంత్రి దేశ్ముఖ్పై 15 రోజుల్లోగా సీబీఐ విచారణ పూర్తి చేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హోంమంత్రి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన సీఎం ఉద్దవ్ ఠాక్రేకు అందజేశారు. అయితే ఆ రాజీనామా లేఖను సీఎం ఆమోదించాల్సి ఉందని మరో మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. హోంమంత్రిపై తాను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఫిర్యాదు చేసిన కారణంగానే తనను బదిలీ చేశారని పరమ్ బీర్ ఆరోపించారు. పోలీసు అధికారులకు నెలకు రూ.100 కోట్ల వసూళ్ల లక్ష్యం విధించారని, అక్రమ బదిలీలు చేశారని హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై పరమ్ బీర్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. గత విచారణలో ఈ ఆరోపణలపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ బాంబే హైకోర్టు ఆయనను పదే పదే ప్రశ్నించింది. కేసులో హోంమంత్రి, ముఖ్యమంత్రి ఉన్నారని చట్టాలను పక్కన పెడతారా అని ప్రశ్నించారు. పరంబీర్ ఆరోపణలపై ఇక సీబీఐ విచారణ చేపడుతుందని, ఇక ఇప్పుడు ఆయన మంత్రి పదవిలో ఉండడం సరికాదు అని ఎన్సీపీకి చెందిన నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కోర్టు ఆదేశాలపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని పరంబీర్ సింగ్ తెలిపారు. ఇదిలావుంటే మహారాష్ట్ర నూతన హోంమంత్రిగా దిలీప్ పాటిల్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. హోంమంత్రిగా అనిల్ దేశ్ముఖ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో దిలీప్ పాటిల్ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలపై బాంబే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే అనిల్ దేశ్ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. దిలీప్ వాల్సే పాటిల్ ఎన్సీపీలో సీనియర్ నాయకుడు. ఆయనకు శాసనలో సభలో అపార అనుభవం ఉంది. ఈయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు పర్సనల్ అసిస్టెంట్గా పనిచేశారు. తాలూకా స్థాయి నుంచి రాజకీయాలను ప్రారంభించారు. తన తండ్రి దత్తాత్రేయ గోవిందరావు వాల్సే పాటిల్ మార్గదర్శకత్వంలో రాజకీయాలను ప్రారంభించారు. ఈయన ’అంబేగావ్’ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రికార్డులకెక్కారు. 2009 నుంచి 2014 వరకూ శాసనసభ స్పీకర్గా కూడా సేవలందించారు. వైద్య విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ఎక్సైజ్ శాఖతో పాటు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. సంకీర్ణ ప్రభుత్వ కాలంలో శాసనసభలో అత్యుత్తమంగా పనిచేసినందుకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. శాసనసభ పనితీరు, న్యాయ మూలాలపై దిలీప్ పాటిల్కు విశేషమైన అనుభవం ఉంది.