- ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా కమిటీ
- కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆమోదం
- ఈ మేరకు పార్లమెంట్ చట్టం చేయాలన్న ధర్మాసనం
- అప్పటి వరకు కమిటీ ద్వారానే ఎన్నికల కమిషనర్ల నియామకం
- సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కీలక ఆదేశాలు
న్యూ దిల్లీ,మార్చి2(ఆర్ఎన్ఎ): ఎన్నికల కమిషనర్ల నియామకంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు వెలువరించింది. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీ సిఫారసుల మేరకు భారత రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమిస్తారని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ప్రతిపక్ష నేత లేకపోతే లోక్సభలో విపక్ష మెజార్టీ పార్టీ ఎంపీని కమిటీలో సభ్యుడిగా చేర్చాలని సూచించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల పక్రియ పారదర్శకంగా ఉండాలని, ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాలకూ కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు గత నవంబరులో ప్రకటించింది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఉత్తర్వులిచ్చింది.
ప్రధాన మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీని ఎన్నికల కమిషన్లో అత్యున్నత నియామకాల కోసం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. సిబిఐ చీఫ్ ఎంపిక తరహాలోనే సిఇసి నియామకం జరగాలని ఐదుగురు సభ్యులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి మాత్రమే నియమించాలని పేర్కొంది. ప్రతిపక్ష నేత లేదా ప్రతిపక్షంలోని మెజారిటీపార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని సూచించింది. ఈ నియామకాల కోసం పార్లమెంట్ చట్టం చేసే వరకు ఈ నిబంధన కొనసాగుతుందని పేర్కొంది. అలాగే ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్నికల కమిషన్ సభ్యులను నియమించడానికి ప్రధానితో పాటు సీజేఐ, విపక్ష నేత సభ్యుడిగా ఉండే కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
సుప్రీంకోర్టు జడ్జిలను నియమించడానికి కొలీజియం వ్యవస్థ ఎలా ఉందో ఎన్నికల కమిషనర్లను నియమించడానికి కూడా అలాంటి వ్యవస్థ ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్లమెంట్లో చట్టం చేయాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు ఈ కమిటీనే కొనసాగుతుందని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేసింది. మాజీ అధికారి అరుణ్ గోయల్ను ఎన్నికల కమిషనర్గా నియమించే ఫైల్ను 24 గంటల్లో అన్ని విభాగాల నుంచి వాయువేగంతో అనుమతి పొందడంపై సుప్రీంకోర్టు ఇదివరకే కేంద్రాన్ని ప్రశ్నించింది. గోయెల్ నియామక ఫైల్ను సమర్పించడానికి ప్రభుత్వ అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ జోసెఫ్ మాట్లాడుతూ.. గణనీయమైన, ఉదారవాద ప్రజాస్వామ్యం ముఖ్య లక్షణాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రజల శక్తితో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. బ్యాలెట్ శక్తి అత్యున్నతమైనది.. అత్యంత శక్తివంతమైన పార్టీలను సైతం గద్దె దింపగలదు..‘ అంటూ పేర్కొన్నారు. ఇఅ స్వతంత్రంగా ఉండాలి. రాజ్యాంగంలోని నిబంధనలు. కోర్టు ఆదేశాలకు లోబడి న్యాయమైన, చట్టపరమైన పద్ధతిలో వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని జస్టిస్ జోసెఫ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో జస్టిస్ అజయ్ రస్తోగి ఎన్నికల కమిషనర్లను తొలగించే విధానం సిఇసిల మాదిరిగానే ఉంటుందని ఈ తీర్పునకు జోడించారు.