రైతు బంధు పంట వేసేటప్పుడు ఇస్తరా..కోసేటప్పుడు ఇస్తరా..?
అప్పుడు పోని కరెంట్ ఇప్పుడే ఎందుకు పోతున్నది..
కరీంనగర్ ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్
కరీంనగర్, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చివరి దాకా కొనసాగేలా లేదని, మధ్యలోనే ఎన్నికలు వొచ్చే అవకాశం ఉందని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి వొస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమ పాలనలో నీళ్లు, విద్యుత్, రైతు బంధు ఇచ్చినమని, పంట కొన్నామని తెలిపారు. దళిత బంధుతో హుజురాబాద్ దళితులు ఆత్మ గౌరవంతో ఉన్నారని అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్రెడ్డి మాయమాటలను ప్రజలు నమ్మారని అన్నారు. కాగా రాజకీయాల్లో గెలుపోటములు సమస్య కాదని అన్నారు.
రైతు బంధు అనేది పంట వేసేటప్పుడు ఇస్తరా లేక పంట కోసేటప్పుడు ఇస్తరా అంటూ కెపిఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రూ. వెయ్యి కోట్ల కంపెనీ మద్రాస్ పోయిందని, నాలుగైదు నెలల్లోనే రేవంత్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వొచ్చిందని కెసిఆర్ విమర్శించారు. తమ హయాంలో పోని విద్యుత్తు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎందుకు ఉంటలేదో ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఇక గోదావరి నీళ్లు లేకపోతే తెలంగాణకు బతుకే లేదని కేసీఆర్ అన్నారు. ప్రధాని మోదీ నీళ్లను పక్క రాష్ట్రాలకు తీసుకెళ్తనంటే సిఎం రేవంత్రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని కెసిఆర్ అన్నారు. ఇక కరీంనగర్ను బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారని, ఆయన ఎంపీ అయ్యాక జిల్లాకు ఏం ఒరిగిందని విమర్శి:చారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.