- రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
- సిఎస్ సోమేశ్కుమార్ను కలిసిన పిసిసి చీఫ్ రేవంత్రెడ్డి
- వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించండి : సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ నేత పొన్నం బహిరంగ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : రాష్ట్రంలో రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ. రేవంత్రెడ్డి, ఇతర టీపీసీసీ నేతలు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో భేటీ అయ్యారు. పోడు భూములపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ సోమేశ్ కుమార్తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. అనంతరం పలు డిమాండ్లతో వున్న మెమోరాండంను సిఎస్కు అందజేశారు. ధరణిని రద్దు చేసి పాత పద్దతిని తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్య పరిష్కరించాలని పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అసైన్డ్ భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు చట్టాన్ని అమలు చేసి, కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణలో ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేలా ఆలోచించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతారని, రైతు సమస్యలపై దశలవారీగా నిరసనలు చేపట్టాలని పార్టీ యోచిస్తుందని తెలిపారు. అలాగే, పార్టీ నేతలు గవర్నర్ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో.. సీఎల్పి నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, కిసాన్ కాంగ్రేస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, మాజీ మంత్రులు నాగం, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, రాములు నాయక్లు పాల్గొన్నారు.
వీఆర్ఏలు డిమాండ్లను పరిష్కరించండి : సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ నేత పొన్నం బహిరంగ లేఖ
తెలంగాణ సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. వీఆర్ఏల డిమాండ్లను ప్రభుత్వం పదిరోజుల్లో పరిష్కరించాలని కోరారు.తేదీ 24 ఫిబ్రవరి 2017 మహాశివరాత్రి పండగ రోజున రోజున ప్రగతి భవన్ సాక్షిగా, మంత్రుల సాక్షిగా, ఉన్నత అధికారుల సాక్షిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన మీరు గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇచ్చిన హామీలైన అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని, పేస్కేలు కల్పించి క్రమబద్ధీకరణ చేస్తామని, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగం కల్పిస్తామని మరియు వీఆర్ఏల సొంత గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదని లేఖలో పేర్కొన్నారు. తరువాత 2020 సెప్టెంబర్ 9 రోజున అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ చట్టం ప్రవేశపెడుతూ వీఆర్ఏ లు అందరికీ పే స్కేలు కల్పించి క్రమబద్ధీకరణ చేస్తామని వారి డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రకటించి నేటికీ 22 నెలలు గడచినా మీ హామీలు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. దీనివల్ల వీఆర్ఏలు తమకు ఉద్యోగ భద్రత లేక, పదోన్నతులు లేక వీఆర్వో వ్యవస్థ రద్దుతో పెరిగిన పని భారం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వంటి కారణాలతో కొంతమంది వీఆర్ఏలు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు.
విధి నిర్వహణలో మరికొందరు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మీ ఆదేశాల మేరకు అక్టోబర్ 12వ తేదీన వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి వారి డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని, మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నందున కోడ్ ముగిసిన తర్వాత మీ సమస్యలను పరిష్కరిస్తామని డిమాండ్లను నెరవేర్చుతామని, వీఆర్ఏలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తెలియజేశారు, ఈ మేరకు మూడు నెలలుగా సమ్మె చేపట్టిన వీఆర్ఏలు సమ్మె విరమించుకొని విధులకు హాజరు కావడం జరిగింది. మునుగోడు ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు గడిచినప్పటికీ ఈనెల ఏడవ తేదీన వీఆర్ఏలతో చర్చలు జరుపుతామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం 20వ తేదీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు వీఆర్ఏలతో చర్చలు జరుపకపోవడం కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మంత్రి కేటీఆర్ కానీ, సిఎస్ సోమేష్ కుమార్ కాని, వీఆర్ఏలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, వీఆర్ఏలు విధులకు హాజరై నెల రోజులు గడిచినప్పటికీ వారికి జీతభత్యాలు కూడా చెల్లించకపోవడం శోచనీయమన్నారు.