Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించేంత వరకు..

  • మీడియా సంయమనం పాటించాలి..!
  • పొత్తుల అంశం ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయి.
  • నిర్ణయాలు జరిగితే వెల్లడిస్తాం
  • జాతీయ నాయకత్వం సూచనల మేరకు బస్సు యాత్రపై నిర్ణయం
  • మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌రాజకీయ పార్టీల సొంత మీడియా కాంగ్రెస్‌పై అపోహలు సృష్టిస్తుందని, తప్పుడు వార్తలు వేసే మీడియా యజమాన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, తప్పుడు వార్తలు వేసి కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హెచ్చరించారు. సీట్ల విషయంలో సమర్థులైన నాయకులను సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మంగళ వారం గాంధీ భవన్‌లో విలేఖరుల సమావేశంలో రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..వారి వారి హోదాలు, గౌరవం తగ్గకుండా సమన్వయం చేసేందుకు కేసీ వేణుగోపాల్‌ ‌కమిటీని నియమించారని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కమిటీ సభ్యులు ఇంచార్జ్ ‌థాక్రే, దీపాదాస్‌ ‌మున్షి, మీనాక్షి నటరాజన్‌, ‌జానారెడ్డి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారన్నారు. కొందరు అధికారులు బీఆరెస్‌కు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ అలాంటి అధికారులపై పీఏసీ సమావేశంలో చర్చించామని, నిబంధనలు ఉల్లంఘించి కొందరు అధికారులు నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు.

పెన్షన్‌ ‌తప్ప మిగతా వాటికి ఎన్నికలయ్యే వరకు ఎలాంటి నిధులు విడుదల చేయొద్దన్నారు. చట్టంలో లొసుగులు వాడుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని బీఆరెస్‌ ‌ప్రయత్నిస్తుందనీ..బీఆరెస్‌కు కొమ్ముకాసే పోలీస్‌, ఐఏఎస్‌, ‌రెవెన్యూ, అన్ని విభాగాల అధికారుల వివరాలను కాంగ్రెస్‌ ‌సేకరిస్తుందన్నారు. తాము నియమించిన ప్రత్యేక కమిటీ ఆ వివరాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందన్నారు. కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడితే కాంగ్రెస్‌ ‌చూస్తూ ఊరుకోదని, ఎన్నికల షెడ్యూల్‌ ‌వొచ్చిన ఆరు నెలల ముందు వేసిన అన్ని టెండర్లపై అధికారంలోకి రాగానే సమీక్షిస్తామన్నారు.

భూముల అమ్మకాలనూ సమీక్షిస్తామని, కేంద్ర ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగానే ప్రభుత్వం పని చేయాలని, నియమ నిబంధనలు ఉల్లంఘించి బీఆరెస్‌కు ప్రయోజనం చేకూర్చే అధికారులందరిపై కఠిన చర్యలు తప్పవని రేవంత్‌ ‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రకటనలకు అవకాశం ఇవ్వాలని మెట్రో హైదరాబాద్‌ ‌వారికి సూచిస్తున్నానన్నారు. బస్సు యాత్రపై రెండు రకాల సూచనలు వొచ్చాయని, అభ్యర్థులను ప్రకటించి బస్సు యాత్రకు వెళ్లాలా..లేక బస్సు యాత్ర మధ్యలో అభ్యర్థులను ప్రకటించాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. జాతీయ నాయకత్వం సూచన మేరకు బస్సు యాత్రపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు.

Leave a Reply