- కెసిఆర్ కుటుంబం పాలనకు చరమగీతం పాడాలి
- పోరాటం ప్రజలది..బాగుపడ్డది కెసిఆర్ కుటుంబం
- చేవెళ్ల వేదికగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పిలుపు
చేవెళ్ల,ప్రజాతంత్ర,ఆగస్ట్26: కెసిఆర్ కుటుంబ పాలనను అంతమొందించేదుకు కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలని చేవెళ్ల వేదికగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. తెలంగాన ఇచ్చిన కాంగ్రెస్నే కెసిఆర్ మోసం చేశారని మండిపడ్డారు. చేవెళ్ల ప్రజాగర్జన కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమం గుర్తు చేసుకుంటే దుఖం వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పాల్గొన్నారు. అయితే తెలంగాణ వల్ల ఒకే కుటుంబం లాభపడింది. పోరాటం ప్రజలది అయితే లాభపడ్డది మాత్రం కెసిఆర్ కుటుంబమని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస అధినేత్రి సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్కు ఎక్కడిదని ప్రశ్నించారు. కేసీఆర్కు బలం ఇచ్చింది మేమే. మాకు మద్దతు ఇవ్వాల్సిన కేసీఆర్ ఇవ్వకపోగా ఇప్పుడు మాపైనే విమర్శలకు దిగుతున్నారని దుయయబట్టారు. తెలంగాణ క్రెడిట్ అంతా నాదే అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ ఇచ్చినందుకు సోనియా నివాసానికి వచ్చి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుందన్నారు. కర్ణాటకలో ఇచ్చిన వాగ్దానాలను అమలు పరుస్తున్నాం. తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తాం. సోనియా, రాహుల్ చెప్పిన మాటను అమలు పరచి చూపిస్తారు. కన్యాకుమారీ నుంచి కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్ర చేశారు. అది కాంగ్రెస్ పార్టీ శక్తి. రేపు తెలంగాణకి షా వస్తున్నారు. ఇన్ని ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతాడు. కేసీఆర్ పార్టీకి బీజేపీతో అంతర్గత ఒప్పంది ఉంది. కేసీఆర్ బీజేపీని, బీజేపీ కేసీఆర్ని అందుకే ఏం అనడం లేదు. హైదరాబాద్ సంస్థానానికి స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్. మా పార్టీ నేతలు పటేల్, నెహ్రూ కలిసి హైదరాబాద్ సంస్థానం ఇండియాలో కలిపారు. భారత రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్. ఐఐటీ, ఐఐఎం ఇచ్చింది కాంగ్రెస్.’ అని ఖర్గే అన్నారు. కానీ ఇవన్నీ మరచిమోడీ కాంగ్రెస్ ఏం చేసిందని అంటున్నారు. ఆంధ్రాలో సాగర్ లాంటి డ్యామ్లను కట్టింది కాంగ్రెస్ పార్టీ అని మరువరాదన్నారు.
దళిత గిరిజనులకు పెద్దపీట వేస్తాం
•ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు
•రాష్ట్రంలో కొత్తగా 5 ఐటిడిఎలు ఏర్పాటు
•అంబేడ్కర్ అభయహస్తం కిం• ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు
•పదో తరగతి పాస్ అయితే రూ.10వేలు
•ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్
చేవెళ్ల,ప్రజాతంత్ర, ఆగస్ట్26: పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చిందని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్లలో కాంగ్రెస్ ప్రజా గర్జన సభ నిర్వహించింది. ఈ సభ వేదిక ద నుంచి రేవంత్ రెడ్డి ఎస్సి, ఎస్టి డిక్లరేషన్ ను ప్రకటించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడతూ.. ‘దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి ఎస్సి, ఎస్టి డిక్లరేషన్ ఏర్పాటు. సోనియా గాంధీ సూచన మేరకు ఎస్సి, ఎస్టి డిక్లరేషన్. కెసిఆర్ చేతిలో దళితులు, గిరిజనులు మోసపోయారు. ప్రతి మండలంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తాం. గ్రాడ్యుయేషన్, పిజి చదివే ఎస్సి, ఎస్టి విద్యార్థులకు వసతి కల్పిస్తాం. అంబేడ్కర్ అభయహస్తం కింద ఎస్సి, ఎస్టి కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎస్సి, ఎస్టిలకు రూ.6లక్షలు ఇస్తాం. పోడు భూములకు పట్టాలిస్తాం. ఎస్సి, ఎస్టిలకు మూడు కార్పొరేషన్ల చొప్పున ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా 5 ఐటిడిఎలు ఏర్పాటు చేస్తాం. ఎస్సి, ఎస్టి విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే రూ.10వేలు ఇస్తాం. గ్రాడ్యుయేషన్, పిజి చదివే ఎస్సి, ఎస్టి విద్యార్థులకు వసతి కల్పిస్తాం‘ అని పేర్కొన్నారు.చేవెళ్లలో ప్రజా గర్జన పేరుతో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. వేదికపై గద్దర్ చిత్రపటానికి ఖర్గే, రేవంత్, భట్టి, తదితరులు నివాళులు అర్పించారు. చేవెళ్ల ప్రజాగర్జన సభలో చేరికలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. డిక్లరేషన్ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చదివి వినిపించారు. ’ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చదవడంతో నా జన్మ ధన్యమైంది. అంబేద్కర్ అభయహస్తం పేరుతో 12 లక్షల ఆర్థిక సహాయం. ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఇందిరమ్మ ఇంటి స్కీమ్, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి రూ. 6 లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. అసైన్డ్, అటవీభూములు, పొడు భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆర్మూర్ నేతలు గోర్త రాజేందర్, వినయ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి చేరారు. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ చేరారు.