- ఇక్కడ పూజలు చేశాకే కేసీఆర్ నామినేషన్
- దశబ్దాలుగా కొనసాగుతున్న సెంటిమెంట్
- నవంబర్ 9న నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు
- అదే రోజు గజ్వేల్, కామారెడ్డి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
- 15న సెంటిమెంట్ హుస్నాబాద్లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారం షురూ…
సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కోనాయిపల్లిలో గల వేంకటేశ్వరస్వామి స్వామి ఆశీస్సులో గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు దశాబ్దాలుగా రాజకీయ ప్రస్థానంలో వోటమి ఎరగని నేతగా రాణిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ టిఆర్ఎస్ పార్టీని స్థాపించిప్పుడు కూడా కోనాయిపల్లి వేంకటేశ్వరసామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరమే నేరుగా జలదృశ్యానికి పయనమయ్యారు. వెంకన్న ఆశీస్సులు తీసుకుని కొత్త పార్టీని స్థాపించడం…అనతి కాలంలోనే టిఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ లభించిన విషయం విధితమే. ఎమ్మెల్యేగా, ఎంపిగా నామినేషన్కు ముందు కూడా కేసీఆర్ వేంకటేశ్వరస్మావి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి..నామినేషన్ పత్రాలకూ ప్రత్యేక పూజలు చేసిన అనంతరమే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం కేసీఆర్కు ఆనవాయితీగా వొస్తుంది. ఏదైనా మంచి కార్యం, నామినేషన్ దాఖలుకు ముదు వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తే శుభం జరుగుతుందని గట్టిగా నమ్మే…కేసీఆర్ నాటి నుండి నేటి వరకు అదే సెంటిమెంటును కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వొచ్చే నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని వొచ్చే నెల 9న సిఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్లా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలుత గజ్వేల్లో, తర్వాత కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్లు, పబ్లిక్ మీటింగ్లకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ మేరకు సోమవారం బిఆర్ఎస్ పార్టీ మీడియాకు ఓ ప్రకటనను కూడా రిలీజ్ చేసింది. వొచ్చే నెల 9న సిఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో రెండు చోట్లా నామనేషన్లు వేసే ముందు కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి రానున్నారు. ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేయడంతో పాటు కామారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడం కోసం, జాతీయ రాజకీయల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమైన తెలంగాణ సిఎం కేసీఆర్ అందుకోసం ఎలాంటి అడ్డంకులు, అవాంతరాలు తలెత్తకుండా ఉండాలని భావిస్తున్నారు. స్వతహాగా దైవభక్తితో పాటు సెంటిమెంట్ను నమ్మే ఆయన తన రాజకీయ అడుగులు వేసే విషయంలో పూర్తిగా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడానికి వొచ్చే నెల 9న రాన్నారు. అయితే, సిద్ధిపేట శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు కూడా కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సెంటిమెంట్ను నమ్ముతారు. ఇదిలా ఉంటే, ఎన్నికల ప్రచారాన్ని సిఎం కేసీఆర్ ఎప్పుడు కూడా సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం నుండి సెంటిమెంటుగా ప్రారంభించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ దఫా కూడా సిఎం కేసీఆర్ హుస్నాబాద్ నియోజకవర్గం నుండి తొలి ఎన్నికల సమరభేరిని మోగించనున్నారు. ఈ నెల 15న హుస్నాబాద్ నుండి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సిఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 16న జనగాం, భువనగిరి, 17న సిద్ధిపేట, సిరిసిల్ల, 18న జడ్చర్ల, మేడ్చెల్ నియోజకవర్గాలలో సిఎం కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభలు ఉంటాయని బిఆర్ఎస్ పార్టీ పేర్కొంది.